ముప్పవరపు వెంకయ్యనాయుడంటే అంత కోపమెందుకు మోడీజీ?
భారతదేశ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడంటే అంత కోపమెందుకు మోడీజీ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దేశమంతా ఆయన్ను రాష్ట్రపతిగా ఎంపిక చేస్తారని ఎదురుచూస్తున్న తరుణంలో భారతీయ జనతాపార్టీ కనీసం ఆయన పేరును ప్రస్తావించలేదు.. ఎవరిని ఎంపిక చేస్తున్నారో పేరు కూడా చెప్పలేదు. ఇదీ ఉపరాష్ట్రపతికి ఈదేశ ప్రధానమంత్రి ఇచ్చే విలువ, గౌరవం.
ఆగస్టు 6న ఎన్నిక
జులై 5వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడుతుంది. ఆగస్టు ఆరోతేదీన ఎన్నిక జరుగుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటు సభ్యులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఉభయ సభల్లో ఎన్డీయే ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని, ఉప రాష్ట్రపతి అభ్యర్థి సులువుగా విజయం దక్కించుకుంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మోడీకన్నా ముందే ఎన్నో పదవులు అధిష్టించిన వెంకయ్య
నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టకముందే వెంకయ్యనాయుడు రాజ్యసభ్యుడిగా, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉండే అద్వానీ, వెంకయ్యనాయుడు మోడీని వెనకేసుకొచ్చారు. తన గురువును కనీసం రాష్ట్రపతి పదవికి కూడా ఎంపిక చేయకుండా ఆయనకు జీవితకాల అవమానాన్ని మిగిల్చారు. వెంకయ్యను ఉప రాష్ట్రపతి పదవికి పంపించి ఆయన్ను క్రియాశీల రాజకీయాలకు దూరం చేశారు. గోద్రా అల్లర్లు చెలరేగిన తరుణంలో రాజనీతి తప్పకూడదంటూ అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి హితవు పలికారు. పదవికి రాజీనామా చేయాలని కోరారు. కానీ అద్వానీ అడ్డుపడి మోడీని గట్టిగా వెనకేసుకొచ్చారు. దాని ఫలితమే ఆయన ఇప్పుడు ఇంట్లో ఉన్నారు. అద్వానీ మోడీని వెనకేసుకొచ్చిన తరుణంలో వెంకయ్యనాయుడు కూడా అద్వానీ వెనకే నిలిచారు. వారి మాటకు గౌరవమిచ్చి వాజ్పేయి లాంటి రాజనీతిజ్ఞుడు మోడీని అప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగించారు. దాని ఫలితాన్ని ఈరోజు దేశప్రజలు మొత్తం అనుభవిస్తున్నారు. తర్వాత కాలంలో ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ అభ్యర్థిత్వాన్ని వెంకయ్యనాయుడు గట్టిగా సమర్థించారు.
నైతిక విలువల్లేని రాజకీయం చేస్తున్న మోడీ
నైతిక విలువల్లేకుండా, తన, మన భేదం లేకుండా కేవలం రాజకీయం మాత్రమే చేస్తున్న నరేంద్రమోడీ, అమిత్ షా దేశంలో నియంతృత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. అటువంటివారికి ఇష్టమైనవారిని తీసుకొచ్చి రాష్ట్రపతిని చేస్తారు.. లేదంటే ఉప రాష్ట్రపతిని చేస్తారుకానీ ఆపత్కాలంలో సాయంచేసినవారి ఆదుకోవడమనేది వారి జీవిత డైరీలోనే లేదంటే అతిశయోక్తి కాదని విమర్శిస్తున్నారు. మరోసారి వెంకయ్యనాయుడిని ఎంపిక చేస్తారని ఆయన కూడా ఆశలు పెట్టుకోలేదని, ఎదుటివారి పూర్తి తత్వం అర్థమైన తర్వాత కూడా ఆశలు పెట్టుకునేంత అల్పుడు వెంకయ్యనాయుడు కాదని ఆయన అనుచరులు అంటున్నారు. మరోసారి కొనసాగింపు ఉంటుందా? లేదంటే ముస్లిం అభ్యర్థిని నిలబెడతారా? అనేది తేలాలంటే కొద్దిరోజులు వేచిచూస్తే చాలు.. నరేంద్రమోడీ, అమిత్ షా రాజకీయం అర్థం చేసుకోవడానికి..!!