అక్క, ఆమె ప్రియుడితో కలిసి భర్త హత్య: అదృశ్యమని..
హైదరాబాద్: కట్టుకున్న భర్తను ఓ మహిళ తన అక్క, ఆమె ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఆ తర్వాత తన భర్త అదృశ్యమయ్యాడంటూ ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారించడంతో ఆమె హత్య చేసిన విషయం బయట పడింది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్ నగర్ జిల్లా ఆమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లికి చెందిన వెంకటయ్య సెంట్రింగ్ కార్మికుడు. భార్య బాలనారమ్మ, కుమార్తె ఉన్నారు. బోరబండలో వారు ఉంటున్నారు. మద్యానికి బానిస అయిన అతను తరుచూ భార్యను హింసించేవాడు. దీంతో అతనిని అంతమొందించాలని బాలనారమ్మ భావించింది.
ఈ విషయాన్ని అక్క వెంకటమ్మకు చెప్పింది. ఆమె, తన ప్రియుడు తిరుపతయ్యతో కలిసి పథకం వేసి.. గత నెల 15వ తేదీన వెంకటమ్మ బోరబండలోని చెల్లెలు ఇంటికి వెళ్లింది. కుమార్తెను మహబూబ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తానని వెంకయ్యను నమ్మించి ముగ్గురిని మహబూబ్ నగర్లోని తన ఇంటికి తీసుకు వచ్చింది.
వెంకయ్యకు అక్కడ మద్యం తాగించారు. మత్తులోకి జారుకోగానే చున్నీ మెడకు బిగించి హత్య చేశారు. అనంతరం వెంకటమ్మ ప్రియుడిని రప్పించి.. మృతదేహాన్ని జడ్చర్ల రోడ్డు పైన పడేశారు. గత నెల 17న మహబూబ్ నగర్ జిల్లాలో హత్య కేసు నమోదైంది. మరోవైపు గత నెల 30న బాలనారమ్మ తన భర్త కనిపించడం లేదని హైదరాబాదులోని అఫ్జల్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తాను భర్తతో కలిసి గత నెల 15న మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుండి మహబూబ్ నగర్ వెళ్లామని, ఆ తర్వాత ఆయన అతని స్వగ్రామానికి వెళ్లాడని పోలీసులకు తెలిపింది. పోలీసులు ఆరా తీశారు. అనంతరం బాలనారమ్మ ఇంటికి వెళ్లి విచారణ చేశారు. బాలనారమ్మపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించింది.