ఏపీలో కరోనా స్టేజ్-3 లోకి ప్రవేశించిందా ? ఇంకా దాక్కుంటున్న వారితోనే సమస్యలు ?
ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోంది. రెండు రోజులుగా 10 నుంచి 15 కొత్త కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం కరోనా వైరస్ ప్రస్తుతం స్టేజ్ 2 ను దాటి స్టేజ్ 3లోకి ప్రవేశిస్తున్నట్లు అంచనా వేస్తోంది. నిపుణుల అభిప్రాయాల మేరకు ఈ మేరకు అంచనాకు వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ చెబుతోంది. అయితే దీనికి గల కారణాలను గుర్తించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
కరోనా స్టేజ్ 3లోకి ఏపీ..
ఏపీలో కరోనా వైరస్ స్టేజ్ 1, 2 దాటి స్టేజ్ 3లోకి ప్రవేశిస్తుందా అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. దీనికి ప్రధాన కారణం ఏపీలో ఇప్పటివరకూ నమోదైన కేసులన్నీ ఓ ఎత్తయితే తాజాగా నమోదవుతున్న కేసులు మరో ఎత్తుగా భావిస్తున్నారు. ప్రధానంగా ఢిల్లీ వెళ్లొచ్చిన వారితో పాటు అప్పటికే విదేశాల నుంచి రాష్ట్ర్రానికి చేరుకున్న వారే కరోనా పాజిటివ్ గా నమోదయ్యారు. అయితే తాజాగా పరిస్దితిలో మార్పు వస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల మాటలను బట్టి అర్ధమవుతోంది.
కరోనా వైరస్ స్టేజ్ 3 లక్షణాలేంటి... ?
కరోనా వైరస్ లో నేరుగా బాధితులైన వారు ఎక్కువగా ఉన్నప్పుడు వారిని స్జేజ్ 1 గానూ, వారి నుంచి ప్రాధమికంగా కొందరికి సోకితే దాన్ని స్టేజ్ 2 గానూ, వారి నుంచి మరికొందరికి సోకినప్పుడు స్టేజ్ 3గానూ చెబుతున్నారు. దీని ప్రకారం స్టేజ్ 1లో విదేశాలతో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన వారిని స్జేజ్ 1 బాధితులుగా పేర్కొంటున్నారు. వారి నుంచి ప్రాధమికంగా కొందరికి సోకిన కారణంగా స్జేజ్ 2గా అభివర్ణిస్తున్నారు. వీరి నుంచి కరోనా వైరస్ మిగతా వారికి సోకితే దాన్ని స్టేజ్ 3గా పేర్కొంటున్నారు.
ఏపీలో తాజా పరిస్ధితేంటి ?
ఏపీలో తాజాగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులను గమనిస్తే వీరంతా విదేశాలు, ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చిన వారు కాదు. ఆ తర్వాత వీరు ప్రాధమికంగా తాకిన వారు, కరోనా వ్యాప్తి చేసిన వారే. నేరుగా విదేశాలు లేదా ఢిల్లీ వెళ్లొచ్చిన వారికి, వారి నుంచి ప్రాధమికంగా కరోనా సోకిన వారికి ఇప్పటికే ప్రభుత్వం దాదాపుగా పరీక్షలు పూర్తి చేసింది. అలా కాకుండా ప్రైమరీ కాంటాక్టుల నుంచి ఇతరులకు సోకుతున్న పరిస్ధితులు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. దీంతో ఏపీ ప్రస్తుతం కరోనా స్టేజ్ 3లోకి ప్రవేశిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే వీరి సంఖ్య నిర్ధారణ అయితే తప్ప స్టేజ్ 3లోకి ప్రవేశించినట్లు కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి.
దాక్కుంటున్న వారితోనే సమస్య..
విదేశాలతో పాటు ఢిల్లీ నుంచి రాష్ట్రానికి చేరుకున్న వారిలో దాదాపు అందరికీ పరీక్షలు పూర్తికాగా.. వీరిలో కొందరు మాత్రం ఇంకా ఇళ్లలో లేదా ఇతర చోట్ల దాక్కుంటూనే ఉన్నారు. వీరి సంఖ్య బయట పడితే తప్ప వాస్తవ పరిస్ధితిపై క్లారిటీ రాదు. అలాగే వీరి నుంచి ఎవరెవరికి సోకిందో తెలియాలన్నా వీరు బయటికి రావాల్సిందే. కానీ కరోనా లక్షణాలు బయయపడినప్పుడు మాత్రమే వీరు బయటికి వస్తుండటంతో ప్రభుత్వానికి సమస్యలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా ఢిల్లీతో పాటు విదేశాల నుంచి వచ్చిన వారందరికీ టెస్టులు పూర్తయ్యాయని చెప్పలేని పరిస్ధితి.
Recommended Video