ఏసీబీ దూకుడు: చిక్కని బాబు వ్యూహం, ఆ మాటలు అక్కడ్నించే?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వం రోజురోజుకు దూకుడు పెంచుతోంది. దూకుడును అడ్డుకునేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతివ్యూహానికి సిద్ధమవుతున్నా, అదేమిటనేది అంతుచిక్కడం లేదు.
మంత్రులు, సహచర పార్టీ నేతలతో రేవంత్ రెడ్డి ఉదంతంపై మాట్లాడుతూనే వారి అభిప్రాయాలు మాత్రమే తీసుకుంటున్నారు. మరోపక్క మూడు రోజులుగా పోలీసు అధికారులతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు. డీజీపీ జెవి రాముడు, ఇంటిలిజెన్స్ డీజీ అనురాధ, ఇతర సీనియర్ అధికారులతో శనివారం మరోసారి చంద్రబాబు రెండు గంటలపాటు భేటీ అయ్యారు.
ఈసారి సమావేశానికి మిగిలిన మంత్రులను, అధికారులను సిఎం దూరంగా ఉంచారు. పోలీసు అధికారులతో ఏకాంతంగా చర్చించారని తెలుస్తోంది. సమావేశం జరిగిన కాసేపటికి డీజీపీ సచివాలయానికి వచ్చి హోంశాఖ కార్యదర్శి ఏకే గోయల్కు ఒక ఫిర్యాదు చేశారు.
రాష్ట్రానికి చెందిన ప్రముఖులు, సీనియర్ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నేతల ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. హోం శాఖ కార్యదర్శి ఈ ఫిర్యాదును రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ద్వారా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించిన ఆడియో క్లిప్పింగ్లలోని గొంతు చంద్రబాబుదేనా కాదా అన్నది తేలాల్సి ఉంది. అయితే, అందులో మాటలు మాత్రం చంద్రబాబు నివాసం ఉంటున్న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 24 నుంచి వచ్చినవేనని తెలంగాణ పోలీసులు గుర్తించారని సమాచారం.
ఇప్పటికే తమ ఫోన్లు ట్యాప్ అయినట్టు నిర్ధారణకు వచ్చిన ఏపీ ప్రభుత్వం, మిషన్లను అక్రమంగా వినియోగించి ఫోన్లను ట్యాప్ చేసినట్టు గుర్తించింది. ట్యాప్ చేయాలనుకున్న వ్యక్తుల కార్యాలయాలు సమీపంలో ఈ మిషన్లను ఉంచినట్టు గుర్తించారని సమాచారం.
ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో ఫోన్ల ట్యాపింగ్ జరుగుతున్నట్టు ఏపీ ప్రభుత్వం గుర్తించిందని వార్తలు వస్తున్నాయి. ఫోన్లను ట్యాప్ చేయడంలో గతంలోనూ ఆ ఐపీఎస్ అధికారికి అనుభవం ఉందని చెబుతున్నారు.
ఏపీ ఇంటిలిజెన్స్ అధికారుల ఫోన్లు సైతం ట్యాప్ అయినట్టు గమనించారు.అసలు వ్యవహారం తమకు అంతుచిక్కడం లేదని, ఓటుకు నోటు వ్యవహారంలో ఏం జరిగిందనేది ఇప్పటికీ అంతుబట్టడం లేదని పలువురు చెబుతున్నారు.
ఏం చేద్దాం?
కాగా, చంద్రబాబు ఆదివారం పోలీసులు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏపీ డీజీపీ జేవీ రాముడు, ఏసీబీ డీజీ మాలకొండయ్య, ఇంటిలిజెన్స్ డీజీలు ఉన్నారు. కోర్టు నోటీసులు ఇస్తే ఏం చేయాలనే దాని పైన చర్చించారని తెలుస్తోంది. అలాగే, కౌంటర్గా ఏం చేయాలనే దాని పైనా చర్చించారని సమాచారం.