ఆ ఉద్యోగ నేతకు జగన్ సర్కార్ చుక్కలు ? బెయిల్ కూడా రాకుండా ఫిక్స్ !
ఏపీలో ఉద్యోగుల సమస్యల విషయంలో గవర్నర్ కు ఫిర్యాదు చేసిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణను ప్రభుత్వం తాజాగా మరోసారి టార్గెట్ చేసింది. వాణిజ్య పన్నుల శాఖలో అక్రమాలకు పాల్పడటం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారంటూ ఆయనపై తాజాగా మరో అభియోగం మోపింది. ఇప్పటికే వాణిజ్య పన్నుల శాఖ ఆదాయానికి గండికొట్టిన కేసులో నలుగురు ఉద్యోగులతో పాటు కేఆర్ సూర్యనారాయణపైనా ఇతర కేసులు పెట్టడంతో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఉద్యోగ నేత కేఆర్ సూర్యనారాయణ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై విజయవాడ కోర్టులో విచారణ జరుగుతున్న క్రమంలోనే ప్రభుత్వం అవినీతి నిరోధక చట్టం కింద ఆయనపై మరో అభియోగం మోపింది. ఈ మేరకు కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది సమాచారం ఇచ్చారు. అక్రమాలకు పాల్పడటం ద్వారా వాణిజ్య పన్నుల శాఖ ఆదాయానికి గండి కొట్టిన ఆరోపణలపై ఇప్పటికే నమోదైన కేసులతో పాటు అవినీతి నిరోధకచట్టంలోని సెక్షన్ 7 కింద ఆయనపై అభియోగాలు మోపారు.

కేఆర్ సూర్యనారాయణపై తాజాగా అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడం వెనుక ఉన్న కారణాల్ని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజయవాడ కోర్టుకు వివరించారు. వాణిజ్య పన్నుల శాఖలో అక్రమాలపై డిప్యూటీ కమిషనర్ షేక్ జహీర్ ఇచ్చిన ఫిర్యాదు వాంగ్మూలంలో సేకరించిన అదనపు సమాచారం ఆధారంగా సూర్యనారాయణపై కేసులో ఈ సెక్షన్ కూడా చేర్చినట్లు కోర్టుకు తెలిపారు. అయితే బెయిల్ పిటిషన్ పై వాదనల చివరి దశలో ప్రభుత్వం కొత్త సెక్షన్ పెట్టడంపై ఆయన న్యాయవాది అభ్యంతరం తెలిపారు. దీంతో విచారణ వాయిదా పడింది.
మరోవైపు తనపై ప్రభుత్వం పెడుతున్న కేసుల్ని కొట్టేయాలని కోరుతూ కేఆర్ సూర్యనారాయణ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ఉద్యోగుల సమస్యలపై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసిన తనను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేస్తోందని, హైకోర్టు కూడా గతంలో తనపై నమోదైన కేసులపై స్టే ఇచ్చిందని తెలిపారు. అయితే విచారణకు ప్రభుత్వ న్యాయవాది హాజరు కాకపోవడంతో హైకోర్టులో ఈ కేసు విచారణ కూడా వాయిదా పడింది.












Click it and Unblock the Notifications