నో వర్రీ: జగన్ దీక్షకు మాదరిగానే ముద్రగడ దీక్ష కూడా?
విజయవాడ: కాపు రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తూ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చేపట్టబోయే దీక్షపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దగా ఆందోళన చెందడం లేదని చెబుతున్నారు. ఆయన శుక్రవారంనాడు తన సతీమణితో కలిసి కిర్లంపూడిలోని తన నివాసంలో ఆమరణ నిరాహారదీక్షకు కూర్చుంటున్న విషయం తెలిసిందే.
ప్రత్యేక హోదాపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టి నిరవధిక దీక్షలాగానే ముద్రగడ దీక్ష కూడా ముగుస్తుందని, అలా ముగించాలని చంద్రబాబు అనుకుంటున్నట్లు సమాచారం.
రాజకీయ స్థాయిలో చంద్రబాబు స్వయంగా పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ముద్రగడ దీక్ష సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాలు పొందకుండా చూడాలని ఆయన పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు.
తుని హింస నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం దీక్ష సందర్భంగా తలెత్తే పరిస్థితులను అదుపు చేయడం పెద్ద కష్టం కాదని, అనుమానితులను అదుపులోకి తీసుకునే క్రమంలో ముద్రగడకు పెద్దగా మద్దతు తెలపడానికి వచ్చేవారి సంఖ్య తగ్గిపోవచ్చునని భావిస్తున్నారు.
గత అక్టోబర్ నెలలో ప్రత్యేక హోదాపై జగన్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఐదు రోజుల పాటు దాన్ని ప్రభుత్వం కొనసాగనిచ్చింది. ఆ తర్వాత ఆరోగ్యం విషమించిందనే కారణంతో జగన్ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఇదే రీతిలో ముద్రగడ పద్మనాభం దీక్షకు కూడా అంత పలకవచ్చునని అనుకుంటున్నారు
జగన్ను ఆస్పత్రికి తరలించే సమయంలో పోలీసులకు పెద్ద ప్రతిఘటన కూడా ఎదురు కాలేదు. చంద్రబాబు నాయుడు ఇప్పటికే కాపు నాయకులు చాలా మందితో సంప్రదింపులు జరుపుతున్నారు. తద్వారా ముద్రగడ పద్మనాభం ఆందోళనకు మద్దతును తగ్గించాలనే ప్రయత్నంలో ఉన్నారు.
అందుకే ముద్రగడతో చర్చలు జరపడానికి చంద్రబాబు ఇష్టంగా లేరని అంటున్నారు. దీక్ష చేయవద్దని చంద్రబాబు కనీసం ముద్రగడకు ఆయన విజ్ఞప్తి కూడా చేయలేదు. ముద్రగడ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మద్దతుతోనే ఇదంతా చేస్తున్నారని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ముద్రగడతో మాట్లాడేందుకు ఆయన నిరాకరించడానికి ఇది కూడా కారణమని అంటున్నారు.
కాపు రిజర్వేషన్లపై అధ్యయనం చేయడానికి తాము వేస్తున్న సబ్ కమిటీ ముందు ముద్రగడ తన వాదనలను వినిపించవచ్చునని గత రాత్రి చంద్రబాబు తన మీడియా సమావేశంలో చెప్పారు. సబ్ కమిటీని రెండు మూడు రోజుల్లో వేస్తామని కూడా ఆయన చెప్పారు.