హైదరాబాద్ను యుటిగా అంగీకరించం: మురళీధర్ రావు
న్యూఢిల్లీ: హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా (యుటిగా) తమ పార్టీ అంగీకరించబోదని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే ప్రతిపాదనను తిరిగి కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఆ స్పష్టీకరణ చేశారు. తెలంగాణపై కాంగ్రెసుకు చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. ఇప్పటి వరకు బిల్లును మంత్రివర్గం ఆమోదించలేదని, ప్రధాన ప్రతిపక్షమైన తమ పార్టీని సంప్రదించలేదని ఆయన అన్నారు.
ఇదిలావుండగా, హరిబాబు నాయకత్వంలోని బిజెపి సీమాంధ్ర నాయకులు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ను కలిశారు. పోలవరం ప్రాజెక్టుకు ఆటంకాలు లేకుండా చూడాలని తాము కోరినట్లు హరిబాబు మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ అనుమతితో ఆ ప్రాజెక్టును నిర్మించడం సాధ్యం కాదని ఆయన అన్నారు. సీమాంధ్ర సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు గురువారంనాడు రాజ్నాథ్ సింగ్ను కలిసి తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే. తాము బిల్లుకు మద్దతు ఇస్తామని, అయితే కాంగ్రెసు పార్టీ వ్యవహారమే అనుమానాస్పదంగా ఉందని రాజ్నాథ్ సింగ్ కెసిఆర్తో అన్నారు.