పేరు మార్పు వివాదం- వైఎస్సార్ తో పోలిక- వైసీపీ యూటర్న్ ! మళ్లీ టీడీపీ గూటికి ఎన్టీఆర్ ?
ఏపీలోని విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును అకారణంగా దివంత సీఎం వైఎస్సార్ పేరుతో మార్చాలన్న వైసీపీ సర్కార్ నిర్ణయం రాజకీయంగా కీలక పరిణామాలకు దారి తీసేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ తమకు సమానమే అంటూచెప్పుకుంటూ వచ్చిన వైసీపీ ఇప్పుడు వీరిద్దరి మధ్య కొత్తగా తలెత్తిన పోలికతో ఇబ్బందుల్లో పడింది. ఇప్పుడు ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరిలో ఎవరో ఒకరినే ఎంచుకోవాల్సిన పరిస్ధితుల్లో టీడీపీ వ్యవస్ధాపకుడిపై బురద జల్లేందుకు కూడా సిద్దమైపోతోంది.

ఎన్టీఆర్ వర్శిటీ పేరు మార్పు
ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. ఎన్టీఆర్ పేరును ఇంకెవరితో అయినా మార్చినా ఇబ్బంది ఉండకపోయేది కానీ ఏకంగా వైఎస్సార్ పేరుతో మార్చడంతో వైసీపీకి చిక్కులు తప్పడం లేదు. దీనికి ప్రధాన కారణం వీరిద్దరినీ ఓన్ చేసుకునేందుకు వైసీపీ ఇప్పటివరకూ చేస్తున్న ప్రయత్నాలే. ఇప్పటివరకూ వీరిద్దరూ తమకు సమానమే అంటూ చెప్పుకుంటూ ఇప్పుడు ఒకరి పేరును మరొకరితో మార్చడంతో వైసీపీ ద్వందవైఖరి బయటపడింది. అదే సమయంలో దీన్ని రాజకీయంగా వాడుకునేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పై వైసీపీ తమ వైఖరి మార్చుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడుతోంది.

వైఎస్సార్-ఎన్టీఆర్ పోలిక
ఇద్దరు దివంగత మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్సార్ మధ్య ఎలాంటి పోలిక లేదు. వీరిద్దరూ కేవలం కొంతకాలం కలిసి రాజకీయాల్లో పనిచేశారు తప్ప వీరిద్దరికీ నేరుగా ఎలాంటి వైరమూ లేదు, అలాగని స్నేహం కూడా లేదు. కానీ వీరిద్దరినీ తమ రాజకీయ అవసరాల కోసం కలిపేసిన వైసీపీ ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. ఎన్టీఆర్ వర్శిటీ పేరు మార్పు తర్వాత వైఎస్సార్, ఎన్టీఆర్ మధ్య పోలిక తెస్తూ వైసీపీ చేస్తున్న రాజకీయాన్ని కౌంటర్ చేయడంలో టీడీపీ సక్సెస్ అయింది. వీరిద్దరి మధ్య ఎలాంటి పోలిక లేదనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో టీడీపీ సక్సెస్ అయింది. దీంతో వైసీపీ సహజంగానే ఇరుకునపడుతోంది.

ఎన్టీఆర్ కు వైసీపీ గుడ్ బై?
ఎన్టీఆర్ వర్శిటీ పేరు మార్పు తర్వాత ఎన్టీఆర్, వైఎస్సార్ మధ్య పోలిక తెచ్చేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంతో వైసీపీ ఇరుకునపడింది. ఇప్పుడు ఎన్టీఆర్ కంటే వైఎస్సార్ గొప్పోడని నిరూపించుకోవాల్సిన పరిస్దితి వైసీపీకి ఎదురవుతోంది. ఎన్టీఆర్ వర్శిటీ పేరు మార్పు సమర్ధించుకోవాలంటే ఇది తప్పనిసరవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చిన పోలికతో వైసీపీ ఇక వీరిద్దరిలో ఒకరినే తమ వాడిగా చెప్పుకోక తప్పనిసరైంది. దీంతో సహజంగానే వైఎస్సార్ ను మోస్తూ ఎన్టీఆర్ ను పక్కనబెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. ఇందులో భాగంగా ఒకే రోజు తమ పార్టీలో ఉన్న ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, వైసీపీ మంత్రి దాడిశెట్టి రాజాతో కీలక వ్యాఖ్యలు చేయించేసింది. లక్ష్మీపార్వతి తన భర్త పేరు తీసేసినా పర్వాలేదని చెప్పేస్తే, దాడిశెట్టి రాజా ఎన్టీఆర్ అంత చేతకానోడు లేడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

టీడీపీకి తిరిగొచ్చిన ఎన్టీఆర్ ?
తాజాగా మారుతున్న రాజకీయ పరిణామాల్లో టీడీపీ వ్యవస్ధాపకుడైన ఎన్టీఆర్ పేరును ఇన్నాళ్లూ తమ అవసరాలకు వాడుకున్న వైసీపీ.. ఇప్పుడు వదులుకోవాల్సి వస్తోంది. వైఎస్సార్ తో పోలిస్తే ఎన్టీఆర్ ఏమీ కాదన్నట్లుగా వైసీపీ నేతలు ఇప్పటికే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ లెగసీని వైసీపీ వాడుకునే ప్రయత్నాలకు తెరపడినట్లుగా భావించవచ్చు. అదే సమయంలో ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ మరోసారి ఆయన పేరును పూర్తిస్దాయిలో వాడుకునేందుకు అవకాశం దక్కింది. వైసీపీ తమ రాజకీయ అవసరాలకు ఎన్టీఆర్ ను వాడుకునేందుకు ప్రయత్నించి విఫలమైందన్న ప్రచారం కూడా టీడీపీకి కలిసి రాబోతోంది. ఓ విధంగా చెప్పాంటే ఎన్టీఆర్ తాను స్ధాపించిన టీడీపీ నుంచి వైసీపీకి వెళ్లి మళ్లీ అదే పార్టీకి తిరిగి వచ్చినట్లయింది.












Click it and Unblock the Notifications