అదే సెంటిమెంట్: ఎన్టీఆర్-కేసీఆర్ దారిలో పవన్ కళ్యాణ్! వారిలాగే..
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం తిరుపతి బహిరంగ సభలో చేసిన ప్రసంగం చర్చనీయాంశమవుతోంది. 33 ఏళ్ల క్రితం స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో సెంటిమెంట్ రగిలించారు.
ఆ తర్వాత, తెలుగు వారు ఒక్కటైనా.. తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే దారిలో నడుస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకు ప్రత్యేక హోదా అంశం పవన్ కళ్యాణ్కు కలిసి వచ్చిందని అంటున్నారు.
సంతోషమని పవన్కు బాబు చురక: స్నేహితుడని సుజన, కేశినేని ఎదురుదాడి
ఇన్నాళ్లు పార్ట్ టైం
పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లు రాజకీయాల్లో పార్ట్ టైంగా వచ్చి వెళ్లారు. రెండున్నరేళ్ల క్రితం ఆయన పార్టీని స్థాపించిన తర్వాత టిడిపి - బిజెపి కూటమికి మద్దతిచ్చారు. ఆయన మద్దతు వల్లే 2014లో ఏపీలో టిడిపి అధికారంలోకి వచ్చింది.
తాను ఎవరికైతే మద్దతిచ్చానో తప్పు చేస్తే వారిని కూడా ప్రశ్నిస్తానని పవన్ చెప్పారు. అదేవిధంగా ఆయన పలుమార్లు బయటకు వచ్చి ప్రశ్నించారు. కానీ, ఇప్పుడు ఆయన పూర్తిస్థాయి రాజకీయాల పైన దృష్టి సారించారు. అటు సినిమాలు చేస్తూనే, ఇటు రాజకీయాలు చేస్తానని పవన్ చెప్పారు. తద్వారా 2019 నాటికి పూర్తిస్థాయిగా అంటే పోటీ చేసే స్థాయికి ఎదిగే అవకాశముందని అంటున్నారు.
నాడు ఎన్టీఆర్కు, నిన్న కేసీఆర్కు, నేడు పవన్ కళ్యాణ్కు..!
33 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ చెన్నారెడ్డిని అవమానించిందని ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవం నినాదాన్ని ఎత్తుకున్నారు. ఆ తర్వాత ఆయన పార్టీ పెట్టి, విజయఢంకా మోగించారు. ఆ తర్వాత కేసీఆర్ తెలంగాణవాదాన్ని ఎత్తుకున్నారు. బీజేపీ సహకారంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. తెలుగువారి ఆత్మగౌరవం ఎన్టీఆర్కు, తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్కు బాగా కలిసి వచ్చిందనే చెప్పవచ్చు.
ఇప్పుడు, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ఇవ్వడం లేదు. దానిపై ఇన్నాళ్లు మౌనంగా వేచి చూసిన పవన్.. ఇక పోరాటమే దిక్కని భావిస్తున్నారు. అందుకోసం బీజేపీ ఎక్కడైతే ఒక ఓటు, రెండు రాష్ట్రాలు అని చెప్పిందో అదే కాకినాడలో తొలి సభను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
ఆనాడు ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవం అన్నట్లు, ఈ రోజు పవన్ ప్రత్యేక హోదాను తెలుగువారి ఆత్మగౌరవంగా అభిప్రాయపడుతున్నారు. ఇచ్చిన మాటను బీజేపీ తప్పవద్దని, సీమాంధ్రులు అంటే అంత చులకనా అని, తాము సంయమనం పాటిస్తున్నామని, ఆగ్రహం వస్తే అంతు చూస్తామని ఆయన బీజేపీని హెచ్చరించారు.
హోదాను ఆయనతో పాటు టిడిపి, వైసిపి, కాంగ్రెస్ పార్టీలు కూడా ఏపీకి ఆత్మగౌరవంగా, కొత్త రాష్ట్రానికి సంజీవినిలా భావిస్తున్నాయి. హోదా ఏపీకి నిజంగానే సెంటిమెంట్తో కూడిన అంశమని చెబుతున్నారు. పవన్ పూర్తిస్థాయి రాజకీయాల పైన దృష్టి సారించినందున, ముఖ్యంగా హోదాతోనే రాజకీయాల పైన దృష్టి సారించినందున ఏ మేరకు ఆయన దీనిని క్యాష్ చేసుకోగలుగుతారనే చర్చ సాగుతోంది.
ఆరేళ్ల క్రితం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా తన తండ్రి మృతి చెందినప్పుడు ఆ సెంటిమెంటును క్యాష్ చేసుకోవాలని ప్రయత్నించారని విపక్షాలు ధ్వజమెత్తుతుంటాయి.