వైసీపీలో కాపులకు హింట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ? రేపు బందరులో ఫుల్ క్లారిటీ !
ఏపీలో కాపు సామాజిక వర్గంలో అనైక్యత కారణంగానే తాను ఓడిపోయినట్లు పవన్ కళ్యాణ్ నిన్న చేసిన వ్యాఖ్యలు అన్ని రాజకీయ పార్టీల్లోనూ చర్చనీయాంశమవుతున్నాయి.
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణే్..తన మాటల్లో పదును కూడా పెంచారు. ముఖ్యంగా ముందు తన సొంతిల్లు చక్కదిద్దుకుంటే, ఆ తర్వాత రచ్చ గెలవచ్చనే ఉద్దేశం పవన్ మాటల్లో కనిపిస్తోంది. ఇప్పటికే కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల్ని కలిపినా రెట్టింపు జనాభా ఉన్న కాపులు రాజ్యాధికారం చేపట్టకపోవడం వెనుక కారణాన్ని పవన్ నిన్న ఒక్కమాటలో చెప్పేశారు. అంతే కాదు తన సొంత సామాజికవర్గమే తనకు ఎలా శత్రువుగా మారుతోందో చెప్పడం ద్వారా ప్రత్యర్ధులపై ఒత్తిడి అమాంతం పెంచేశారు.

కాపులపై పవన్ కామెంట్స్
కులాల కుంపటిగా కనిపించే ఏపీలో కాపు సామాజిక వర్గం కోసం అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ సీరియస్ గా పనిచేయడం లేదనే విమర్శలు అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా కాపుల్ని ఐక్యం చేయడానికి పవన్ కళ్యాణ్ ఇప్పటివరకూ సీరియస్ గా ప్రయత్నించలేదనే చర్చ కూడా జరుగుతుంటుంది. తనపై ఎక్కడ కాపు ముద్ర పడుతుందో అన్న భయంతో పవన్ దీనికి దూరంగా ఉండిపోయారనే చర్చ కూడా ఉంది. దీంతో ఇన్నాళ్లు కాపులపై సీరియస్ గా దృష్టిపెట్టని పవన్. నిన్న కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న హరిరామజోగయ్యను పిలిపించుకుని ఆయన ముందే కుందబద్దలు కొట్టేశారు.

కాపుల్లో అనైక్యతపై పవన్ వ్యాఖ్యలు
నిన్న మంగళగిరిలో జనసేన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ .. కాపుల్లో ఐక్యత లేదని, అదే ఉండి ఉంటే గత ఎన్నికల్లో తాను ఓడిపోయే పరిస్థితి ఉండేది కాదన్నారు. గత ఎన్నికల్లో కాపుల జనాభా ఎక్కువగా ఉన్న గాజువాక, భీమవరం స్ధానాల్ని ఎంచుకుని పోటీకి దిగినా తాను ఓడిపోవడం వెనుక కాపుల్లో ఐక్యత లేకపోవడమే అన్న అంశాన్నిపవన్ గుర్తుచేశారు. వైసీపీ, టీడీపీ, జనసేనగా కాపులు చీలిపోవడం వల్ల తాను నమ్ముకున్న కాపు ఓట్లు తనకు పడలేదన్న అంశాన్ని పవన్ చెప్పినట్లయింది. తద్వారా కాపుల్లో ఐక్యత ఉండాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు.

కాపుల్లో అనుమానాలు పొగొట్టేలా ..
అయితే కాపు సామాజిక వర్గం తనకు ఏకపక్షంగా అండగా ఉండకపోవడం వల్ల జరుగుతన్న నష్టాన్ని గుర్తుచేసిన పవన్.. దీని వెనుక ఉన్న కారణాలపైనా పరోక్షంగా స్పందించారు. జనసేనను నమ్ముకున్న ఏ ఒక్కరి ఆత్మగౌరవాన్నీ తగ్గించనని, టీడీపీకి అండగా ఉంటూ.. జనసేనను 20 సీట్లకే పరిమితం చేశామన్న వాదనను నమ్మొద్దని పవన్ కోరారు. అలాగే లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకోనని, పార్టీని నమ్ముకున్నవారి ఆత్మగౌరవాన్ని తగ్గించనని, ఒకరితో అవమానపడి ఎందుకుంటాననీ ప్రశ్నించారు. జనసేన ఎవరి అజెండాల కోసం పని చేయదని క్లారిటీ ఇచ్చారు. ఇవన్నీ ప్రస్తుతం కాపు సామాజికవర్గంలోనే పవన్ పై ఉన్న అనుమానాలే.

వైసీపీ కాపు నేతలపై పవన్ తాజా వ్యూహం ?
జనసేనను కాదని ఇతర పార్టీల్లో చేరిన కాపు నేతలు తనను టార్గెట్ చేస్తుండటాన్నీ పవన్ ఆక్షేపించారు. ముఖ్యంగా తనను నిత్యం టార్గెట్ చేసే వైసీపీ కాపు నేతల్ని ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే భవిష్యత్తులో వారిపై ఒత్తిడి పెంచడం ద్వారా జనసేనలోకి రప్పించాలన్న వ్యూహమే కనిపిస్తోంది. గోదావరి జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో కాపులు ఐక్యంగా ఉంటే ఇతర పార్టీల్లో కాపు నేతలు తనపై దాడులు చేసే పరిస్ధితి రాదని పవన్ చెప్పకనే చెప్పినట్లయింది. తద్వారా వైసీపీలో కాపు నేతల్ని ఎన్నికల నాటికి కాపు సామాజిక వర్గం ద్వారా ఒత్తిడికి గురిచేసి తమ పార్టీలోకి రప్పించుకోవాలనే వ్యూహం కనిపిస్తుందని చెబుతున్నారు. అలాగే రేపు బందరులో జరిగే సభలో దీనిపై పవన్ మరింత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.












Click it and Unblock the Notifications