పవన్ ఛాలెంజ్ చేస్తే లక్షలమంది, ఆశీస్సులుండవు: చిరు
హైదరాబాద్: తన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పైన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర ప్రచార కమిటీ చీఫ్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్కు ఒక సోదరుడిగా తన ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని, రాజకీయ నేతగా మాత్రం తన ఆశీస్సులు ఉండవని స్పష్టం చేశారు.
కాంగ్రెసు పార్టీని వేలెత్తి చూపే వారు ఎవరైనా తమకు శత్రువులేనని చెప్పారు. తనకు తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తనను ఛాలెంజ్ చేస్తే లక్షలాది మంది తమ్ముళ్లు తనకు అండగా ఉంటారని చిరంజీవి ధీమా వ్యక్తం చేశారు. రాజకీయంగా తనకు పవన్ కళ్యాణ్ ప్రత్యర్థియే అన్నారు.

తమ్ముడు కల్యాణ్ ఆశయాలకు, ఆలోచనలకు స్వేచ్ఛ ఉందని, తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు. అయితే, అవి తమ్ముడిగా మాత్రమేనని అభిప్రాయపడ్డారు.
కాగా, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఇటీవల స్థాపించడంతో మెగా సోదరుల మధ్య రాజకీయ విభేదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి కాంగ్రెసు పార్టీలో ఉండగా, పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించి బిజెపి, టిడిపిలతో పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నారు. పవన్ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు.












Click it and Unblock the Notifications