కెసిఆర్ ఆకర్ష్: టి ఎమ్మెల్యేలు, ఎంపీ జగన్కి షాకిస్తారా?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు పలువురు సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలోను గెలిచిన ఆ కొద్ది ఎమ్మెల్యేలు తెరాస వైపు చూస్తున్నారట. ఖమ్మం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే సీట్లను గెలిచింది.
ఇక్కడ తెరాస కంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే బలంగా ఉంది. దీంతో ఆ పార్టీని దెబ్బతీసే ప్రయత్నాలను తెరాస ప్రారంభించిందంటున్నారు. దీనికి తోడు, తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న తెరాస అధినాయకత్వంఅసెంబ్లీలో తమ ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకోవటమే లక్ష్యంగా పావులు కదుపుతోంది.

ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 60. ప్రస్తుతం ఆ పార్టీకి 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో మరింత మెజార్టీని పెంచుకునే వ్యూహానికి తెరాస పదును పెట్టింది. తమ ఎమ్మెల్యేల సంఖ్యను కనీసం 70 వరకు తీసుకెళ్లడంలో భాగంగా రాజకీయ ప్రత్యర్థులను బలహీనపర్చటానికి పూనుకుంది.
ఇందులో భాగంగా జగన్ పార్టీ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు ప్రారంభించిందంటున్నారు. జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో తెరాస ముఖ్యనేతలు సంప్రదింపులు జరిపారట. ఎంపీ, ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లుగా సమాచారం. తెరాస ప్రభుత్వం ఏర్పడుతున్నందున తమ పార్టీలోకి రావాలని సూచించారట. తెరాస కేవలం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలనే కాకుండా టిడిపి, కాంగ్రెసు ఎమ్మెల్యేలకు కూడా ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోందంటున్నారు.












Click it and Unblock the Notifications