తోటి మహిళా ఉద్యోగికి అసభ్య సందేశాలు, పంచాయతీ సెక్రటరికి దేహశుద్ది
ఓ మహిళా ఉద్యోగికి ఫోన్ మెసేజ్లు పంపుతూ వేధిస్తున్న ఓ గ్రామ పంచాయతీ సెక్రటరీని గ్రామస్తులు చితకబాదారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా ప్యాపిలిలో చోటు చేసుకుంది.
కర్నూలు: ఓ మహిళా ఉద్యోగికి ఫోన్ మెసేజ్లు పంపుతూ వేధిస్తున్న ఓ గ్రామ పంచాయతీ సెక్రటరీని గ్రామస్తులు చితకబాదారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా ప్యాపిలిలో చోటు చేసుకుంది.
సహోద్యోగిని పైనే అతను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. సెల్ఫోన్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపి ఆ ఉద్యోగిని చిత్రహింసలకు గురిచేశారు.
బాధితురాలు ద్వారా ఈ వేధింపుల విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు ఆ పంచాయతీ కార్యదర్శిగా ఉన్న జనార్ధన్కు దేహశుద్ధి చేశారు.
మండల పరిషత్ కార్యాలయంలో జరిగే సమావేశం సమయంలో కూడా ఏదో సాకుతో ఆమెతో అసభ్యకరంగా మాట్లాడేవాడని చెబుతున్నారు. అంతటితో ఆగకుండా సెల్ఫోన్ ద్వారా తరచూ అసభ్యకర సందేశాలు పంపేవాడు.
ఈ సందేశాలు తన కాపురంలో ఎలాంటి చిచ్చు పెడతాయోనని మహిళా ఉద్యోగి తీవ్ర మనస్తాపం చెందేవారు. ఈ విషయాన్ని భర్తతో పాటు గ్రామస్థుల దృష్టికి తీసుకు వెళ్లింది. దీంతో గ్రామస్థులు పంచాయతీ కార్యాలయంలో ఉన్న కార్యదర్శి జనార్దన్ను బయటకు లాక్కొని వచ్చి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.