మహిళ హత్య: మామ పట్టుకుంటే, భర్త చంపేశాడు
గుంటూరు: ఓ మహిళను భర్త, మామ కలిసి పొట్టన పెట్టుకున్న సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం లంకెలపాడు గ్రామంలో బుధవారంనాడు ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది.పిచ్చాల లక్ష్మి(35), సాంబిరెడ్డిలకు సుమారు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కొంత కాలం నుంచి భార్య, భర్తల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి.
ఈ స్థితిలో లక్ష్మి ఏడు నెలల క్రితం భర్తపై అలిగి గురజాల మండలం జంగమహేశ్వర పురంలోని పుట్టింటికి వెళ్ళింది. భర్తపై గురజాలలో కేసు పెట్టింది. అక్కడి పెద్దల సమక్షంలో మే నెల 23వ తేదీన లంకెలకూరపాడులోని భర్త వద్దకు వచ్చింది. అయినప్పటికీ భార్య, భర్తల మధ్య సయోధ్య కుదరలేదు. భార్య కింది అంతస్తులో, భర్త ముగ్గురు పిల్లలతో పై అంతస్తులో ఉంటున్నారు. మామ బక్కిరెడ్డి పక్క గదిలో ఉంటున్నాడు.
సాంబిరెడ్డికి ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీంతో పాటు రూ.40 లక్షల వరకు అప్పు కూడా ఉంది. అప్పు గురించి భార్య, భర్తలకు ఎప్పుడూ గొడవ జరుగుతూ ఉండేది. పొలాన్ని అమ్మి అప్పు తీర్చాలని కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండేది. వారు పట్టించుకోకపోవటంతో ఉన్న ఐదు ఎకరాలలో ఒక ఎకరం లక్ష్మి సొంతంగా దున్నించి బుధవారం పత్తి విత్తనాలు నాటేందుకు సిద్ధపడింది.
దాంతో సాంబిరెడ్డి, అతని తండ్రి బక్కిరెడ్డిలు లక్ష్మితో గొడవకు దిగారు. లక్ష్మిని భర్త సాంబిరెడ్డి పట్టుకోగా మామ బక్కిరెడ్డి పచ్చడి బండతో లక్ష్మి తలపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాంబిరెడ్డి, బక్కిరెడ్డిలు పిల్లలతో కలసి పోలీసు స్టేషన్లో లొంగి పోయినట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం సత్తెనపల్లికి తరలించారు.