ఇంజనీరుతో అక్రమ సంబంధం: ప్రియుడితో భర్తను చంపించిన మహిళ
చిత్తూరు: ఓ ఇంజనీరుతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తన భర్తను ప్రియుడితో హత్య చేయించింది. చిత్తూరు జిల్లా పీలేరులో గత నెలలో హత్య జరిగింది. పట్టణ శివార్లలోని కల్యాణ మండపం వద్ద గత నెల 15వ తేదీ రాత్రి తలను వేరుచేసి ఒక వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన వెలుగు చూసింది. అప్పట్లో గుర్తుతెలియని వ్యక్తి హత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు.
పీలేరు సీఐ నాగరాజు, ఎస్సై సుధాకర్రెడ్డి అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం మిరాసపల్లె గ్రామానికి చెందిన మహేష్ (35)తో అదే గ్రామానికి చెందిన సువర్ణ (30)కు పదమూడేళ్ల కిందట వివాహం అయింది. మహేష్ తాపీ మేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని సాకుతూ వస్తున్నాడు.
ఏడాది క్రితం ఈ దంపతులు బెంగళూరులో ఒక ప్రముఖ భవన నిర్మాణ సంస్థలో చేరి పనులు చేసుకుంటూ వస్తున్నారు. ఇదే సంస్థలో కలకడ మండలం సింగనొడ్డుపల్లెకు చెందిన మధు (24) సివిల్ ఇంజనీరుగా పనిచేసేవాడు. ఆరునెలల కిందట సువర్ణకు మధుతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరి ప్రవర్తనపై అనుమానం కలిగిన భర్త భార్యను పలుమార్లు మందలించినా ఆమె తీరు మారలేదు.
భర్త అడ్డు తొలగించుకోవాలని భార్య భావించి ఈ విషయాన్ని ప్రియుడు మధుకు చెప్పింది. ఆ తరువాత బెంగళూరు నుంచి ఎవరి వూళ్లకు వారు వెళ్లిపోయారు. అప్పటి నుంచి మధు, సువర్ణ తరచుగా మొబైల్ ఫోన్లలో మాట్లాడుకుంటూ వస్తున్నారు. మహేష్ను చంపడానికి పన్నిన కుట్రలో భాగంగా మధు అతన్ని విందుకు రావాల్సిందిగా తన స్వగ్రామానికి ఆహ్వానించాడు.
ఇది నమ్మిన మహేష్ సెప్టెంబరు 15వ తేదీన మహబూబ్నగర్ జిల్లా నుంచి రైల్లో తిరుపతికి చేరుకున్నాడు. మధు అదేరోజు రాత్రి అతన్ని తన ద్విచక్రవానంలో తీసుకుని పీలేరు వైపునకు బయలుదేరాడు. దారి మధ్యలో మహేష్తో మద్యం తాగించాడు. తొలుత భాకరాపేట ఘాట్రోడ్డులో హత్య చేయాలని ప్రయత్నించినా ఫలించలేదు.
రాత్రి 1గంట సమయంలో పీలేరు శివార్లలోని కల్యాణ మండపం వద్దకు చేరుకుని రాత్రి నిద్రించేందుకు అక్కడ ఆగారు. కాసేపటి తరువాత మహేష్ గాఢనిద్రలోకి జారుకోవడంతో ఇదే అదనుగా భావించిన మధు బండరాయితో అతని తలపై మోదాడు. మహేష్ మృతిచెందక పోవడంతో చెట్టు కిందకు ఈడ్చుకెళ్లి తనవెంట తెచ్చుకున్న కత్తితో అతని గొంతు కోసి తలను గుట్టలో పడేసి అక్కడి నుంచి పారిపోయాడు.
మృతుడి జేబులో లభించిన బీడీ కట్ట బార్కోడ్ ఆధారంగా హత్య కేసును ఛేదించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న మహేష్ భార్య సువర్ణ, నిందితుడు మధు శుక్రవారం పీలేరు తహసీల్దార్ మునిప్రకాష్ ఎదుట లొంగిపోయారని, వారిని రిమాండుకు పంపామని తెలిపారు.