రేప్ యత్నం: కళ్లలో కారం కొట్టి అతన్ని చంపేసింది
చిత్తూరు: తనపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిని కళ్లలో కారం కొట్టి ఓ మహిళ చంపేసింది. చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలంలో బుధవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి - గుడుపల్లె మండలం దాసిమానుపల్లె పంచాయతీ అత్తినత్తం గ్రామానికి చెందిన రేణుక (24)కు భర్త మంజునాథ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ కుటుంబం గ్రామానికి రెండుకిలోమీటర్ల దూరంలో ఉన్న తమ పొలంవద్ద ఇల్లు నిర్మించుకుని నివసిస్తోంది.
అదే గ్రామానికి చెందిన కృష్ణప్ప (55) బుధవారం రాత్రి 8 గంటల సమయంలో రేణుక వంట చేస్తుండగా ఇంటికి వచ్చి అత్యాచారయత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించింది. అక్కడే ఉన్న కారం పొడిని చేతిలోకి తీసుకుని కృష్ణప్ప కళ్లల్లో కొట్టడంతో కృష్ణప్ప పరారయ్యాడు. 9 గంటల ప్రాంతంలో కృష్ణప్ప రేణుకను బలాత్కారం చేయడానికి మళ్లీ ప్రయత్నించాడు. దీంతో సంగటి కట్టె తీసుకుని రేణుక కృష్ణప్ప తలపై గట్టిగా మోదింది. దాంతో ఆగకుండా ఎద్దుల బండి చక్రానికి అడ్డుగా ఉంచే ఇనుప కమ్మెను తీసుకుని అతని తలపైన, శరీరంపైనా దాడి చేసింది.

తట్టుకోలేకపోయిన కృష్ణప్ప, అక్కడించి బయటకు పరిగెత్తి వచ్చి సుమారు అర కిలోమీటరు దూరంలో ఉన్న రోడ్డుపై పడి స్పృహ తప్పాడు. అదేరోజు రాత్రి 2 గంటల ప్రాంతంలో అతడిని చూసిన గ్రామస్థులు కొందరు కుప్పంలోగల ఓ ప్రైవేటు ఆసుపత్రికి చేర్చారు. అయితే కృష్ణప్ప అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కాగా ఈ ఘటన జరిగిన సమయంలో రేణుక భర్త మంజునాథ్, పిల్లలు ఊరికి వెళ్లారు. తనపై బలాత్కారం చేయబోయిన కృష్ణప్పను తానే హతమార్చినట్లు రేణుక పోలీసులకు చెప్పింది. రేణుకతోపాటు ఆమె భర్త మంజునాథ్, ఇద్దరు పిల్లలు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. కృష్ణప్ప మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వాసుపత్రికి చేర్చారు.












Click it and Unblock the Notifications