ఏం జరిగింది?: అతను హైదరాబాద్ వెళ్లొచ్చేసరికే, యువతి అనుమానాస్పద మృతి
Recommended Video
గుంటూరు: అరండల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జి సెంటర్ సమీపంలోని ఓ ఇంట్లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలు రెండేళ్లుగా ఓ యువకుడితో సహజీవనం చేస్తోందని, ఈ నెల 20న అతను హైదరాబాద్ వెళ్లొచ్చేసరికి ఇంట్లో ఆమె విగతజీవిగా కనిపించిందని పోలీసులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతిది హత్యా?.. ఆత్మహత్యా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఎవరీ యువతి?:
పొట్టి శ్రీరాములు నగర్ రెండో లైనుకు చెందిన అఖిల్ తేజ (21)కి రెండేళ్ల క్రితం ఫోన్ చాటింగ్ ద్వారా శ్రీలక్ష్మి అనే యువతి పరిచయమైంది. పెళ్లి చేసుకుంటానని మాటివ్వడంతో అఖిల్ తేజకు ఆమె మరింత దగ్గరైంది. తర్వాత కొద్దికాలానికే ఇద్దరు కలిసి ఓ ఇంట్లో కాపురం పెట్టారు. ఆరండల్ పేటలోని కోహినూర్ బార్ సమీపంలో ఉన్న ఆ ఇంట్లో ఇద్దరు సహజీవనం చేస్తున్నారు.
కుళ్లిపోయిన స్థితిలో..:
ఈ నెల 20న హైదరాబాద్ వెళ్లి శనివారం మధ్యాహ్నమే ఇంటికొచ్చేసరికి శ్రీలక్ష్మి విగతజీవిగా కనిపించినట్టు అఖిల్ తేజ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు వారు ఉంటున్న గది వద్దకు వెళ్లగా.. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన రావడం గమనించారు పోలీసులు. అదే గదిలో రెండు మజ్జిగ బాటిళ్లు, ఓ కూల్డ్రింక్ బాటిల్ కూడా లభించాయి. తలుపు లోపలివైపు గడియపెట్టలేదని గుర్తించారు. మృతురాలు పంజాబీ డ్రస్ ధరించినప్పటికీ 'లో దుస్తులు' లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
గతంలో వ్యభిచారం కేసు:
అఖిల్ తేజపై కూడా పోలీసులకు అనుమానం కలిగినట్టు తెలుస్తోంది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన సమయంలో.. తొలుత శ్రీలక్ష్మి పేరుని భాను అలియాస్ బంగారంగా చెప్పినట్టు సమాచారం. ఆపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టగా.. ఆమె అసలు పేరు శ్రీలక్ష్మి అని, ఆమెది మాచర్ల బోడు ప్రాంతమని గుర్తించారు. 2014లో నగరంపాలెం పోలీస్ స్టేషనులో శ్రీలక్ష్మి వ్యభిచారం చేస్తూ పట్టుబడినట్టుగా కూడా గుర్తంచారు. అయితే అప్పటికీ ఆమె మైనర్ కావడంతో బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించారు.
దర్యాప్తు ముమ్మరం..:
శ్రీలక్ష్మి విషయమై ఆమె బంధువులను సంప్రదించడానికి పోలీసులు ప్రయత్నించగా.. ఎవరి వివరాలు తెలియరాలేదు. దాచేపల్లిలో ఉంటున్న ఆమె మేనమామను సంప్రదించగా.. స్పందించడానికి అతను అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, మృతదేహానికి సోమవారం పంచనామా, పోస్టుమార్టమ్ నిర్వహించనున్నారు. అఖిల్ తేజను మరిన్ని విషయాలపై ఆరా తీస్తున్నారు. దర్యాప్తులో మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది.