Independence Day: దిల్లీలో 19 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు..? ఆగస్టు 15 వేళ హై అలర్ట్..!
భారతదేశం 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధం అవుతోంది. దేశ ప్రజలంతా 'హర్ ఘర్ తిరంగా' ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని దిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో దిల్లీలో పోలీసులు, అధికారులు అప్రమత్తం అయ్యారు.
ఈ మేరకు ఇండియన్ ముజాయిద్దీన్, ఆల్ ఖయిదా, ఖలిస్థానీ గ్రూప్ నకు చెందిన ఉగ్రవాదులకు సంబంధించిన పోస్టర్లను దిల్లీ పోలీసులు విడుదల చేశారు. అంతేకాక వీరికి సంబంధించిన వివరాలను చెబితే తగిన రివార్డును అందజేస్తామని పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలుగా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది.
దేశంలోని భద్రతా బలగాలు, భద్రతా సంస్థలతో సంయుక్తంగా రాజధాని దిల్లీలో పోలీసులు సెక్యూరిటీని టైట్ చేశారు. సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను పెంచారు. దిల్లీలోని పెద్ద పెద్ద మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్, ఇతర ప్రధాన మార్గాలు, ప్రాంతాల్లో నిఘాను పెంచారు. ఏదైనా అనుమానాస్పద ఘటన జరిగినా.. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినా వెంటనే తమకు సమాచారం అందించాలని దిల్లీ పోలీసులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఇండియాస్ 19 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల ఫొటోలను బహిర్గతం చేసి పోస్టర్స్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వీరిలో ఇండియన్ ముజాయిద్దీన్, ఆల్ ఖైదా, ఇతర ఖలిస్థానీ టెర్రరిస్టు సంస్థలకు చెందిన ఉగ్రవాదులు ఉన్నారు. ఈ పోస్టర్లలో రియాజ్ భక్తల్, షాబాంద్రి మహమ్మద్ ఇక్బాల్ అలియాస్ ఇక్బాల్ భక్తాల్, మహమ్మద్ షార్జీల్ అక్తర్, అబు సుఫీయాన్, సయ్యద్ మహమ్మద్ హర్షియాన్ లు ఉన్నట్లు సమాచారం. వీళ్లంతా ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందినవారుగా దిల్లీ పోలీసులు పేర్కొన్నారు.

ఖలిస్థానీ టెర్రరిస్టుల్లో రంజిత్ సింగ్ అలియాస్ నీతా, ఖలిస్థాన్ జిందాబాద్ ఫోర్స్ కు చెందిన పరమ్ జీత్ సింగ్ పమ్మా, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ కు చెందిన హర్ష్ దీప్ సింగ్ అలియాస్ అర్ష్ దాల్ లు ఉన్నారు. ఇతర వాంటెడ్ టెర్రరిస్టుల్లో హర్వీందర్ సింగ్ సంధూ అలియాస్ రిందా, వాద్వా సింగ్ బబ్బర్, గుర్మీత్ సింగ్ బగ్గాలు ఉన్నారు వీళ్లంతా బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ కు చెందినవారుగా పోలీసులు స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications