నిప్పంటించుకుని మహిళ మృతి, 30పూరిళ్లు దగ్ధం
హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలంలోని వేట్లపాలెంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 30 పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. ఒక మహిళ ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోవడంతో మంటలు చెలరేగినట్లు స్ధానికులు తెలిపారు.
కటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యకు పాల్పడటంతో ఇంట్లో ఉన్న సిలిండర్ పేలి చుట్టు పక్కల ఇళ్లకు మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మహిళ చనిపోయింది. ఈ క్రమంలో మొత్తం 30 పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. రూ. 50 లక్షల వరకు ఆస్తినష్టం జరిగి ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు.
సమాచారం అందుకున్న ఫైర్ డిపార్ట్మెంట్ హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. పూరిళ్లలోని గ్యాస్ సిలిండర్లు పేలడంతో మొదట సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. ఈ ప్రమాదంలో కాలిబూడిదైన పూరి గుడిసెలు నిరు పేదలవి కావడంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటున్నారు.
షార్ట్ సర్క్యూట్ తో ట్రాక్టర్ దగ్ధం
గుడివాడ మండలం పోలుకొండ దగ్గర షార్ట్ సర్క్యూట్తో వరి గడ్డితో వెళుతున్న ట్రాక్టర్ దగ్ధమైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.