ఆ బాధ్యతలు కూడా తీసుకున్న జగన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తుతం విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటనలో ఉన్నారు. తమ ప్రభుత్వ హయాంలో నిర్మాణం ప్రారంభమైన నర్సీపట్నం మెడికల్ కాలేజీని ఆయన స్వయంగా సందర్శించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..ప్రభుత్వ వైద్య కళాశాలలను పరిరక్షించేలా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడానికి, రాష్ట్ర విద్యార్థుల డాక్టర్ కలను సాకారం చేయడం కోసం జగన్ ప్రభుత్వంలో 8,480 కోట్ల రూపాయలతో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఆయా మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా పీపీపీ కింద ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించింది.

దీనికి వ్యతిరేకంగా జగన్ ఈ ఉద్యమాన్ని చేపట్టారు. ప్రజా పోరాట బాట పట్టారు. విశాఖపట్నానికి చేరుకున్న జగన్ కు పార్టీకి చెందిన జిల్లా నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడినుంచి అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం వెళ్తారు. ఎన్ఏడీ జంక్షన్, వేపకుంట, పెందుర్తి, కొత్తూరు జంక్షన్, తాళ్ళపాలెం జంక్షన్ మీదుగా వెళ్ళి మధ్యలో నిర్మాణం నిలిపివేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శిస్తారు.
అనంతరం మధ్యాహ్నం అక్కడినుంచి బయలుదేరి విశాఖపట్నం కేజీహెచ్ చేరుకుంటారు. తాళ్ళపాలెం జంక్షన్, కొత్తూరు జంక్షన్, పెందుర్తి, వేపకుంట, ఎన్ఏడీ జంక్షన్ మీదుగా ఆయన ప్రయాణం సాగుతుంది. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్ధులను పరామర్శిస్తారు. అనంతరం సాయంత్రం అక్కడి నుంచి తిరుగుపయనమవుతారు.
విశాఖకు వచ్చిన జగన్ ను స్టీల్ ప్లాంట్ కార్మికులు కలిశారు. తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. వారి సమస్యలు సావధానంగా విన్న ఆయన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమష్టి పోరు చేపడదామని సూచించారు. ఎటువంటి ఇబ్బందులు గానీ, ఆటంకాలు గానీ సంభవించినా పార్టీ వెనుకంజవేయబోదని అన్నారు. ప్రైవేటీకరణ కానివ్వకుండా చూసే బాధ్యత తనదేనని చెప్పారు.
అలాగే- నక్కపల్లి మండలానికి చెందిన 16 గ్రామాల మత్స్యకారులు జగన్ ను కలిశారు. తమ బాధలు చెప్పుకున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ను అడ్డుకోవాలని బాధితులు వినతిపత్రం అందజేశారు. కాలుష్య కారక పరిశ్రమలు తమకు వద్దని స్పష్టం చేశారు. జీ భీమవరం వద్ద పోలీసులు మత్స్యకారులను అడ్డుకున్నప్పటికీ.. లెక్క చేయలేదు. జగన్ను కలిసేందుకు అనుమతి లేదంటూ వెనక్కి పంపించడానికి ప్రయత్నించినప్పటికీ.. కలిసి తీరుతామని మత్స్యకారులు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications