ఏపీ, తెలంగాణాలో కార్మిక పోరాటాల జోరు.. సమస్యల పరిష్కారాలకు ముగింపెన్నడు?
తెలుగు రాష్ట్రాల్లో కార్మిక పోరాటాలు కొనసాగుతున్నాయి. ఏపీలో ఇసుక కొరతతో నిర్మాణ రంగ కార్మికులు పనుల్లేక, పస్తులు ఉండలేక తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ పోరుబాట పట్టారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని 28 రోజులుగా పోరాటం చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లోనూ రోజుల తరబడి కార్మిక పోరాటం కొనసాగుతున్నా సమస్య పరిష్కారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.
కేసీఆర్ మరో ఎత్తుగడ.. ఆర్టీసీ సమ్మె విఫలం చేయడానికేనా..! కార్మిక సంఘాల వ్యూహమేంటో?
ఏపీలో ఇసుక కొరతతో నిర్మానరంగా కార్మికుల పోరు బాట
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పాత ఇసుక విధానాన్ని రద్దు చేసి, నూతన ఇసుక విధానం రూపొందించే వరకు ఇసుక కొరత ఏర్పడింది. ఇక ఆ తర్వాత నూతన ఇసుక విధానం అందుబాటులోకి వచ్చినప్పటికీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో నిర్మాణ రంగ అవసరం మేరకు ఇసుక లభించటం లేదు. దీంతో నిర్మాణ రంగంపై ఆధారపడిన కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. జీవనోపాధి లేక నరకం చూస్తున్నారు.
కార్మికులకు అండగా ప్రతిపక్ష పార్టీల ఆందోళనలు
కార్మికుల సమస్యలను తెలుసుకున్న ప్రతిపక్ష పార్టీలు నిర్మాణ రంగ కార్మికుల కోసం, ఇసుక కొరత నివారించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇసుక పోరు చేస్తూనే ఉన్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీలు అధికార పార్టీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇసుక కొరత తీర్చడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించినా ఫలితం మాత్రం శూన్యం. ఇప్పటికే పనుల్లేక, బ్రతుకు భారమై నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ పరిస్థితులు ఏపీలో ఇసుక కొరత సమస్య తీవ్రత ఎంతగా ఉందో తేటతెల్లం చేస్తుంది.
ఇసుక సమస్య తీర్చటానికి ఇసుక వారోత్సవాలు చెయ్యాలని ప్రభుత్వ నిర్ణయం
ప్రతిపక్షాలు ఆందోళనలు చేసిన, ర్యాలీలు చేసిన, ధర్నాలు చేసినా , నిరాహార దీక్షలకు దిగినా సమస్య మాత్రం సమస్యలాగే ఉండిపోయింది. ప్రభుత్వం వర్షాలు, వరదలు తగ్గితేనే ఇసుకను ప్రజల అవసరాలకు తగ్గట్టుగా అందించడానికి వీలవుతుందని, ఇసుక సమస్య తీర్చడం కోసం ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తామని చెప్పి చేతులు దులుపుకుంది. ఏపీలో నెలకొన్న ఇసుక సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందో తెలియక నిర్మాణ రంగ కార్మికులు దిక్కుతోచని స్థితిలో దీనంగా ఎదురుచూస్తున్నారు.
తెలంగాణా రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల పోరుబాట
ఇక తెలంగాణ రాష్ట్రానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరహాలో ఆర్టీసీని విలీనం చేసి, సమస్యలు పరిష్కరించాలని కార్మిక లోకం పోరుబాట పట్టింది. 28 రోజులుగా దిక్కులు పిక్కటిల్లేలా సమర నినాదం చేస్తూనే ఉంది. సమ్మె చేస్తున్న కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని సీఎం కేసీఆర్ ప్రకటించి ఆర్టీసీ మునిగిపోయే నావ అని మూతపడుతోందని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు తప్ప ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి పెద్దగా చొరవ చూపలేదు.
ప్రాణాలు పోతున్నా సరే కానరాని సమస్య పరిష్కారం
17 మంది ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు పోగొట్టుకున్న, ఆర్టీసీ కార్మిక కుటుంబాలు పిల్లలతో సహా రోడ్లపైకి వచ్చి మమ్మల్ని కాపాడండి మహాప్రభో అన్నా ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకు పోతుంది. ఆర్టీసీ సమస్యను, కార్మికుల డిమాండ్ల నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా తలకు మించిన భారంగా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఆర్టీసీ కార్మికులు ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్న, తమ ఆవేదనను రకరకాలుగా తెలియజేస్తున్నా, సకల జనభేరి పేరుతో సబ్బండ వర్ణాలు తమ సమ్మెకు మద్దతు తెలుపుతున్నారని ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్నా ససేమిరా అంటుంది ప్రభుత్వం.
ఆర్టీసీ కార్మికులకు అండగా ప్రతిపక్ష పార్టీల సమరం
ఇక ప్రతిపక్ష పార్టీలు సైతం ఆర్టీసీ కార్మికులకు అండగా మేమున్నామంటూ ప్రభుత్వ వైఖరి పైన దుమ్మెత్తి పోస్తున్నాయి. కార్మికుల కోసం ప్రభుత్వం దిగి రావాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఇంతగా ఆందోళన చేస్తున్న అధికార పార్టీ తీరు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు గానే ఉంది. గత రెండు నెలలుగా జీతాలు రాక, కుటుంబ పోషణ భారమై, మరోపక్క సమ్మె చేస్తున్న ప్రభుత్వ స్పందన లేక, ప్రాణాలు పోతున్నా పట్టించుకునేవారు కానరాక ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తమను కాపాడే వారు,తమ సమస్యలను పరిష్కరించేవారు ఎవరున్నారు అని దీనంగా ఎదురుచూస్తున్నారు.
సమస్యలను అధిగమించలేని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు .. పోరాటాల ముగింపు ఎప్పుడో ..
ఇది తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఇసుక సమస్యను అధిగమించలేక పోతుంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను అధిగమించలేక పోతుంది. కార్మికుల కన్నీరు తుడిచేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేక పోతున్నాయి తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలు. ఇక తమ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది అంటూ, తమ బాధలు ఎప్పుడు తీరుతాయి అంటూ అసలు ఈ సమస్యలకు పరిష్కారం ఉందా లేదా అంటూ రెండు రాష్ట్రాల్లోని కార్మికులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. మాకెందుకీ శిక్ష అంటున్నారు.