జగన్కు అర్హత లేదు: యనమల, బొత్సపై చినరాజప్ప
హైదరాబాద్: రుణమాఫీపై ఆందోళన చేసే అర్హత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందని, ఏ పని లేకపోవడంతో మనుగడ కోసమే ఆందోళన బాట పట్టారని ఎద్దేవా చేశారు.
ఆయన బుధవారం మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ఆందోళన చేయకుండా తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అన్నారు. రాజధాని నిర్మాణంపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి అన్ని పార్టీలు సహకరించాలని యనమల రామకృష్ణుడు కోరారు. భూసేకరణలో ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని అన్నారు.
ఇసుక దందా చేసేది బొత్సే: చినరాజప్ప
ఇసుక దందాల్లో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఎవరూ లేరని ఏపి ముఖ్యమంత్రి చినరాజప్ప చెప్పారు. ఇసుక దందాలు చేస్తున్నది మాజీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణేనని ఆయన ఆరోపించారు. ఇసుక సమస్యను వారంలోగా పరిష్కరిస్తామని అన్నారు.
రైతు రుణ మాఫీపై ఏపీ సర్కార్ తుది కసరత్తు
ఆంధ్రప్రదేశ్లో రైతు రుణాల మాఫీపై ప్రభుత్వం శరవేగంగా ముందుకు వెళుతోంది. రుణమాఫీకి సంబంధించిన ఖాతాలపై తుది కసరత్తు చేస్తోంది. ఏపీలో మొత్తం రుణ మాఫీకి 81 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 5,82,703 దరఖాస్తులు రుణ మాఫీకి అర్హత లేనివిగా అధికారులు గుర్తించారు. 15,13,272 అకౌంట్లకు ఆధార్, రేషన్ కార్టులు అనుసంధానం లేనివిగా తేలింది.
ఆధార్ కార్డు లేకుండా రేషన్ కార్డులు మాత్రమే ఉన్న దరఖాస్తులు 2,47,185 కాగా ఆధార్ కార్డు ఉండి రేషన్ కార్డు లేని ఖాతాలు 7,20,401గా అధికారులు గుర్తించారు. బుధవారం అర్ధరాత్రికి ఈ ఖాతాలను ఆన్లైన్లో పెట్టనుంది.
అర్హత లేనివిగా గుర్తించిన ఖాతాలను వీఆర్ఓ, వీఆర్ఏలతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 49,3700 ఖాతాలను రుణమాఫీ కింద గుర్తించారు. నవంబర్ 15న బ్యాంకుల్లో రుణ మాఫీ కోసం రూ. 15వేల కోట్లు జమ చేస్తుంది. మరో రూ. 2 వేల కోట్లను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.