బయటకు రావద్దు, 50 డిగ్రీలకు ఉష్ణోగ్రత - ఈ జిల్లాల్లో మంటలే.. తాజా హెచ్చరిక..!!
భానుడి భగభగలు. ఒక్క సారిగా ఉష్ణోగ్రతలు భారీ స్థాయికి చేరాయి. వడ కాల్పులు.. ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఈ సమయంలోనే విపత్తుల నిర్వహణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రేపు( గురువారం) అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. ఇప్పటికే 46 డిగ్రీల వరకు నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలు.. రేపు 50 డిగ్రీలకు చేరుతాయని వెల్లడించింది. అయిదు రోజుల పాటు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మంట పుట్టిస్తున్నాయి. గురువారం రికార్డు స్థాయిలో ఎండలు మండి పోతాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. పశ్చిమ గోదావరి, పోలవరం జిల్లాల్లో పలుచోట్ల 50 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ... గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, కోనసీమ, బాపట్ల, నంద్యాల తదితర జిల్లాల్లో 49 నుంచి 50 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని తెలిపింది. 310 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 147 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని వెల్లడించింది. కాగా, కోస్తాంధ్రలో బుధవారం నుంచి తీవ్ర వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు 45-47 డిగ్రీలు... నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 43-44... అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో 41-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని 71 మండలాల్లో వడగాడ్పులు ఉంటాయని హెచ్చరించింది.

అయిదు రోజులు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
అదే విధంగా రాయలసీమ, దక్షిణకోస్తా మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాయలసీమలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వడ గాడ్పుల తీవ్రత మరింత పెరుగనుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వచ్చే ఆదివారం వరకు వడగాడ్పులు కొనసాగుతాయని వెల్లడించారు. ఉదయం పది గంటల తరువాత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. మంగళవారం పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 23 జిల్లాల్లోని 233 మండలాల్లో 41 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పల్నాడు, నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం, కృష్ణా, తిరుపతి, నంద్యాల, బాపట్ల, ఎన్టీఆర్, విజయనగరం జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. నెల్లూరు జిల్లా గూడూరులో 44.9, కృష్ణా జిల్లా కంకిపాడులో 44.5, మార్కాపురం జిల్లా పెద్ద చర్లోపల్లిలో 44.2, ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో 44.1, బాపట్ల జిల్లా ఇంకొల్లులో 43.2, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో 43.1, గుంటూరు జిల్లా పాండ్రపాడులో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాల్లో ఉష్ణోగ్రత లు మరింత పెరిగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.













Click it and Unblock the Notifications