విజనరీ నాయకుడికి ప్రిజనరీ నాయకుడికి ఉన్న తేడా ఇదే.. యనమల ధ్వజం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై తెలుగుదేశం పార్టీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీ, జనసేన, వామపక్ష పార్టీలు కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, జగన్ కు పాలన చేత కాదని ఈ నిర్ణయంతో మరోసారి నిరూపితమైంది అని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.

విద్యుత్ ఉత్పత్తి లేక ధరలు పెంచడం నేటి ప్రిజనరీ పనికిమాలిన విధానం
చంద్రబాబు పాలనతో జగన్మోహన్ రెడ్డి పాలనను పోలుస్తూ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విజనరీ నాయకుడికి ప్రిజనరీ నాయకుడికి ఉన్న తేడా చెప్పడానికి నేడు పెంచిన విద్యుత్ ధరలే ప్రత్యక్ష నిదర్శనమని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఒక్క సారి కూడా విద్యుత్ ధరలను పెంచకపోగా, మిగులు విద్యుత్ సాధించటం కోసం చంద్రబాబునాయుడు ఎంతో కృషి చేశారని అది ఆయన విజన్ అంటూ యనమల పేర్కొన్నారు. కానీ విద్యుత్ ఉత్పత్తి లేక ధరలు పెంచడం నేటి ప్రిజనరీ పనికిమాలిన విధానమంటూ యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.

విద్యుత్ చార్జీల పెంపుతో విసనకర్రలు, లాంతర్ల పథకం అమలుకు జగన్ రెడ్డి సన్నాహాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుతో విసనకర్రలు, లాంతర్ల పథకం అమలుకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ సన్నాహాలు చేస్తున్నట్లు ఉందని యనమల రామకృష్ణుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంతకాలం అప్పుల్లోనే అనుకున్నాం, ఇప్పుడు అధిక విద్యుత్ ధరలను దేశంలో ఏపీని టాప్ లో నిలిపిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు.

జగన్ ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తుంది
ఈ పిచ్చి ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తూ విద్యుత్ ఛార్జీలు పెంచి విసనకర్రలు, లాంతర్ల పథకం తీసుకువస్తామని చెపుతుందేమో అంటూ యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. ప్రజలపై భారం వేయడానికి, వాళ్ల నడ్డి విరగొట్టడమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలన సాగిందని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. గతంలో దారిద్ర రేఖకు దిగువన ఉన్న జనాభా సంఖ్యను తగ్గించడం కోసం టిడిపి ప్రయత్నం చేసిందని పేర్కొన్న యనమల, నేడు జగన్ మోహన్ రెడ్డి వీలైనంత మందిని దారిద్ర్యరేఖకు దిగువకు నెట్టడమే పనిగా పెట్టుకున్నారు అంటూ ఆరోపించారు.

పేద, మధ్యతరగతి ప్రజలపై జగన్మోహన్ రెడ్డి మోయలేని భారం వేస్తున్నారు
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఐదేళ్లలో ఒక్కసారి కూడా ధరలు పెంచకున్నా జగన్ రెడ్డి బాదుడే బాదుడు అంటూ దీర్ఘాలు తీశారని, కానీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఏడు సార్లు ధరలు పెంచి ప్రజలకు షాక్ ఇచ్చారని యనమల మండిపడ్డారు. సగటు వినియోగం ఆధారంగా కేటగిరి నిర్వహించే పద్ధతిని రద్దుచేసి నెలవారి కేటగిరి నిర్ణయించే కొత్త విధానాన్ని తీసుకువచ్చి పేద, మధ్యతరగతి ప్రజలపై జగన్మోహన్ రెడ్డి మోయలేని భారం వేస్తున్నారు అంటూ యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.

ఆ ఒప్పందాలను రద్దు చేసుకోవటం వల్లే ఈ పరిస్థితి
జగన్ రెడ్డి తన సహజమైన విధ్వంసం, వికృత ఆనందపు చర్యలతో నాడు విద్యుత్ కోసం ముందుచూపుతో చంద్రబాబు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవడం కారణంగానే నేడు అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తుందని యనమల రామకృష్ణుడు వెల్లడించారు. విద్యుత్ సర్దుబాటు చేసుకోవాల్సింది పోయి అధిక ధరలకు కొంటున్నాము అని చెబుతూ ఆ భారాన్ని ప్రజల నెత్తిన వేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.
Recommended Video


విద్యుత్ చార్జీల పెంపు ప్రజల మంచి కోసమే అని చెప్తారేమో
ఇక మద్యం తాగి ప్రజలు చనిపోకుండా ఉండడానికి మద్యం ధరలు పెంచామని చెప్పిన జగన్, నేడు విద్యుత్ చార్జీల పెంపు కూడా ప్రజల మంచి కోసమే అని చెప్పేలా ఉన్నాడంటూ యనమల ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దిగజార్చారని మండిపడిన యనమల రామకృష్ణుడు విద్యుత్ చార్జీల పెంపుతో జగన్ సామాన్యులను బాదడానికి రెడీ అయ్యారని నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications