వైసీపీ అంతర్గత సర్వే... ఎన్ని సీట్లంటే..?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రస్తుతం ఎంతో ఆత్మవిశ్వాసంతో కనపడుతున్నారు. ఇటీవలే విడుదలైన ఇండియాటుడే మూడ్ ఆఫ్ ది నేషన్, ఇండియా టీవీ, టైమ్స్ నౌ సర్వేల్లో అత్యధిక స్థానాలు వైసీపీకే దక్కుతాయని వెల్లడైంది. ఇవే కాకుండా పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న ఐప్యాక్ సంస్థ ప్రతి మూడునెలలకు ఒకసారి సర్వేచేసి నివేదిక అందజేస్తోంది. ఇందులో కూడా ఫలితాలు సానుకూలంగానే వస్తున్నాయి. వీటిపై ఆధారపడకుండా సొంతంగా సర్వేలు చేయించుకొని నివేదికలు తెప్పించుకోవడం ముఖ్యమంత్రికి అలవాటు.

ఐప్యాక్ తాజా సర్వే..
తాజాగా ఐప్యాక్ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం ఉత్తరాంధ్ర, రాయలసీమలో పార్టీకి ఎటువంటి ఢోకా లేదని, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం తక్కువ స్థానాలు వస్తాయని తెలిపింది. అర్బన్ ప్రాంతాల్లో పార్టీమీద సానుకూల వాతావరణం కనపడటంలేదని, ఆ ప్రాంతాలపై దృష్టిపెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఏమిటి? అనే కోణంలో ఐప్యాక్ సర్వే నిర్వహించగా మొత్తం 175 స్థానాలకు 140 నుంచి 160 మధ్యలో వస్తాయని వెల్లడైంది.

బలమైన ఓటుబ్యాంకును రూపొందించుకోవాలి
ఇప్పటికే ఉన్న ఓటుబ్యాంకు కాకుండా పథకాల ద్వారా మరికొంత ఓటుబ్యాంకును పెంచుకున్నామనే యోచనలో వైసీపీ అధిష్టానం ఉంది. రెండు సంవత్సరాల ముందు నుంచే ఎన్నికలకు సిద్ధమవుతున్న జగన్ అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ప్రజల్లో వ్యతిరేకత తలెత్తకుండా చూసుకుంటున్నారు. ఎక్కడైనా వ్యతిరేకత వ్యక్తమవుతున్నా వాటిని సానుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. లోటుపాట్లు తెలుసుకొని వాటిని సరిదిద్దుకునే పనిలో పడ్డారు.

కూటమి కట్టినా ఢోకా లేకుండా..
బలమైన ఓటుబ్యాంకును రూపొందించుకోవడద్వారా భవిష్యత్తులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కట్టినా పార్టీకి ఎటువంటి ఢోకా లేకుండా చూసుకుంటున్నారు. పార్టీ అంతర్గతంగా నిర్వహించుకున్న సర్వేలో కూడా అర్బన్ ప్రాంతాల్లో బలహీనపడ్డామని తేలింది. ఈ ప్రాంతంలోని ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించే పనిలో అధిష్టానం ఉంది. సర్వేల ప్రకారం పార్టీ ఎక్కడైనా బలహీనంగా ఉందని తేలినా కఠినచర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడబోనని ముఖ్యమంత్రి జగన్ గతంలోనే ఎమ్మెల్యేలకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications