వైసీపీ నేతల వారుసుల లిస్టు - వీరికి సీఎం జగన్ ఓకే చేసినట్లేనా..!!
ఏపీ రాజకీయ పార్టీల్లో ముందస్తుగానే అభ్యర్ధుల కసరత్తు మొదలైంది. అందునా రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీల్లోనూ వారసుల ఎంట్రీకి పెద్ద ఎత్తున పోటీ మొదలైంది. టీడీపీ ఈ సారి యువతకు 50 శాతం సీట్లు ఇస్తామని చెప్పటం ద్వారా సీనియర్లు తమ వారసులను రంగంలోకి దించేందుకు సిద్దమయ్యారు. ఇదే సమయంలో.. వైసీపీలోనూ వారసుల లిస్టు భారీగానే ఉంది. కొద్ది రోజుల క్రితం గడప గడపకు ప్రభుత్వం సమీక్షలో భాగంగా సీఎం జగన్ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, మాజీ మంత్రి పేర్ని నాని తమ కుమారులకు టికెట్లు కావాలని అడుగుతున్నారని.. వారిద్దరూ తనతో వచ్చే ప్రభుత్వంలో కలిసి పని చేయాల్సిందేనని..వారసులకు టికెట్లు లేవని తేల్చి చెప్పారు.

వైసీపీలో పెరిగిపోతున్న వారసుల జాబితా
దీంతో..తమ వారసులను రంగంలోకి దించిని మిగిలిన నేతల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే వైసీపీలో పలువురు నేతలు వచ్చే ఎన్నికల్లో తమ వారసులను నియోజకవర్గంలో ప్రజలకు దగ్గర చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో సీఎం జగన్ కు అత్యంత సన్నిహితంగా మెలిగే నేతలూ ఉన్నారు. ధర్మాన సోదరులు. స్పీకర్ తమ్మినేని తమ వారసులను రంగంలోకి దించేందుకు గ్రౌండ్ సిద్దం చేసారు. తిరుపతి - చంద్రగిరి ఎమ్మెల్యేలు భూమన, చెవిరెడ్డి కుమారులు ఇప్పటికే నియోజకవర్గాల్లో యాక్టివ్ గా ఉన్నారు. భూమన కుమారుడికి ఇప్పటికే సీఎం నుంచి హమీ లభించిందని చెబుతున్నారు. అదే విధంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వారసుడికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి తన కుమారుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ఇప్పటికే ప్రకటించారు. అదే విధంగా సీఎం జగన్ బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తనయుడు సైతం పోటీకి ఒంగోలులో సిద్దం అవుతున్నారు.

కొందరు నేతలకు సీఎం హామీ ఇచ్చారంటూ
ఇక, మచిలీపట్నం నుంచి పేర్ని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఇప్పటికే సీఎంకు చెప్పారు. తన కుమారుడు పోటీ చేస్తారని ప్రతిపాదించారు. సీఎం ఇప్పటి వరకు అంగీకారం చెప్పకపోయినా.. ఎన్నికల నాటికి అంగీకరిస్తారని పేర్ని నాని నమ్మకంతో ఉన్నారు. మంత్రి విశ్వరూప్ కుమారుడు ఇప్పటికే నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. విశ్వరూప్ అనారోగ్య కారణాలతో వచ్చే ఎన్నికల్లో మంత్రి కుమారుడే వైసీపీ అభ్యర్ధిగా పోటీలో దిగటం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి ముఖ్యమంత్రి కాదనే అవకాశాలు లేవని సమాచారం. విజయనగరం జిల్లా నుంచి మంత్రిగా ఉన్న బొత్సా సత్యనారాయణ కుమారుడు డాక్టర్ సందీప్ జిల్లా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి తన కుమార్తె శ్రావణికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ సీటు విషయంలో సీఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

సీఎం జగన్ తుది నిర్ణయంపై ఉత్కంఠ
గుంటూరు జిల్లా నుంచి ఎంపీ మోపిదేవి తన కుమారుడిని.. గుంటూరు తూర్పు నుంచి ఎమ్మెల్యే ముస్తఫా తన కుమార్తును ఎన్నికల్లో నిలబెట్టాలని భావిస్తున్నారు. అదే విధంగా మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత భర్త వచ్చే ఎన్నికల్లో ఎంపీగా అవకాశం ఇస్తే పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. తూర్పు గోదావరి మంత్రి వేణుగోపాలకృష్ణ తన కుమారుడు చెల్లుబోయిన నరేన్ కోసం టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కుమారుడు తోట పృధ్వీరాజ్ లోక్సభకు పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ లిస్టులో కొందరికి సీఎం జగన్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో పోటీ చేయలేని నేతలకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. మిగిలిన నియోజకవర్గాల్లో సర్వేల ఆధారంగా.. ప్రత్యర్ధి పార్టీల అభ్యర్ధుల ఎంపిక చూసిన తరువాత తుది నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications