ప్యాకేజీ కాదది కుళ్లిపోయిన క్యాబేజీ: రోజా సంచలన వ్యాఖ్యలు
అమరావతి: కుళ్లిన క్యాబేజీలాంటి ప్యాకేజీని ఏపీకి కేంద్రం ప్రకటించి రాష్ట్రానికి మనుగడ లేకుండా చేసిందని వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. సోమవారం చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఆమె మీడియాతో విలేకరులతో మాట్లాడారు.
నెల్లూరుకు చెందిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, చిత్తూరుకు చెందిన సీఎం చంద్రబాబు నాయుడు హోదాకు అడ్డుగా ఉన్నారని ఆమె ఆరోపించారు. కేంద్రంలో అధికారంలోకి రాకముందు పదేళ్లు హోదా కావాలన్న వెంకయ్య ఇప్పుడు హోదా ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు.
ఇక తాము అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదా సాధించి తీరుతామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడో హోదా సంజీవని కాదని చెబుతున్నారని అన్నారు. ప్యాకేజీలకు ఆశపడి ఏపీకి ప్రత్యేకహోదాను అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. వారిద్దరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని కాణిపాకం వినాయక స్వామివారిని కోరుకున్నట్లు ఆమె తెలిపారు.
ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగావకశాలు లభిస్తాయని అన్నారు. ఇక పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రత్యేక హోదా అన్నవారు ఇప్పుడు అవసరంలేనట్టు ప్రవర్తించడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం ఏపీకి హోదా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.