కేంద్రంపై వైసీపీ కౌంటర్ ఎటాక్ - వాళ్లకు అవసరమే : ఢిల్లీ కేంద్రంగా -మొదలైందా..!!
కేంద్రం ఏపీలో ఆర్దిక పరిస్థితిని శ్రీలకంతో పోల్చటం.. పోలవరం నెపం రాష్ట్ర ప్రభుత్వంపైన నెట్టటంతో వైసీపీ ముఖ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంకలోని పరిస్థితులపైన కేంద్రం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ఏపీతో సహా 11 రాష్ట్రాల ఆర్దిక పరిస్థితిని కేంద్రం ప్రశ్నించటం పైన వైసీపీ నేతలు రియాక్ట్ అయ్యారు. వైసీపీ ఎంపీలు కేంద్రం ప్రస్తావించిన అంశాలు..చేసిన వ్యాఖ్యల పైన రియాక్ట్ అయ్యారు. గతం కంటే భిన్నంగా స్పందించారు. కేంద్రానికి సూచనలు చేసారు. శ్రీలంకతో పోలికలెందుకని ప్రశ్నించారు. కేంద్రం తన ఆర్థిక పరిస్థితి చూసుకుంటే మంచిదంటూ వ్యాఖ్యానించారు.

వైసీపీ ఎంపీలు క్లియర్ గా
వైసీపీ ఎంపీలు డాక్టర్ తలారి రంగయ్య, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎన్.రెడ్డప్ప మీడియా ఢిల్లీ పరిణామాలపైన స్పందించారు. శ్రీలంకతో రాష్ట్రాల ఆర్దిక పరిస్థితి ఎలా పోలుస్తారని ప్రశ్నించారు. ఆర్దిక క్రమశిక్షణ కేంద్రానికి అవసరమే కదా అంటూ వ్యాఖ్యానించారు. కేంద్రంతో పోలిస్తే రాష్ట్రం అప్పులు తక్కువని చెప్పుకొచ్చారు.రాష్ట్ర అప్పుల్లో ప్రతి రూపాయి సద్వినియోగమవుతోందని వివరించారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా నేరుగా పంపిణీ అవుతుందన్నారు. మూడేళ్లలో డీబీటీ ద్వారా రూ.1.65 లక్షల కోట్లు పేదలకు అందాయని చెప్పుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వం మాదిరిగా వ్యయం చేయలేదు. ఇకనైనా వాస్తవాలు గుర్తించి దుష్ప్రచారాలు మానాలని, శ్రీలంకతో రాష్ట్రాన్ని పోల్చవద్దంటూ సూచించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు వద్దని ఎంపీలు స్పష్టం చేసారు.

కేంద్ర పరిస్థితిపై నిలదీత
రాష్ట్ర జీఎస్డీపీని శ్రీలంక జీడీపీతో పోల్చితే మన జీఎస్డీపీ చాలా బాగుందని ఎంపీలు వివరించారు. శ్రీలంక జీడీపీ 81 బిలియన్ డాలర్లు కాగా, మన జీఎస్డీపీ 160 బిలియన్ డాలర్లుగా వెల్లడించారు. అంటే ఒక దేశం కంటే మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా బాగుందని ఎంపీలు చెప్పుకొచ్చారు. అప్పుల్లో సైతం ఏపీ- శ్రీలకం మధ్య పోలిక లేదన్నారు. రాష్ట్ర అప్పుల కంటే ఇవాళ కేంద్రం చేసిన అప్పులే ఎక్కువని చెప్పారు. కేంద్రం అప్పులు ఏకంగా 133 లక్షల కోట్లకు చేరుకున్నాయన్నారు. కేంద్రం తన ఆర్థిక పరిస్థితి చూసుకుంటే మంచిదని పేర్కొన్నారు. అందుకే ఇంకా ప్రజలను మభ్య పెట్టొద్దని సూచించారు. వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దంటూ ఎంపీలు వ్యాఖ్యానించారు.

పోలవరం బాధ్యత కేంద్రానిదే
పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిందని... అందుకే ఆ ప్రాజెక్టు బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని ఎంపీలు పేర్కొన్నారు. ప్లానింగ్, డిజైన్ బాధ్యతలు పూర్తిగా కేంద్రానివేనని స్పష్టం చేసారు. ఢిల్లీ కేంద్రంగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో వైసీపీ కేంద్రాన్ని కౌంటర్ ఎటాక్ చేయటం ఇప్పుడు రాజకీయంగా చర్చకు కారణమైంది. కేంద్రంతో మైత్రి కొనసాగిస్తున్న సమయంలోనే... కేంద్రంలోని కొందరు ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేయటంతో.. వైసీపీ సైతం దీనిని తిప్పి కొట్టాలని నిర్ణయించింది. ఇది ఈ అంశాల వరకే పరిమితం అవుతుందా.. మరింత ముందుకు వెళ్లి.. రాజకీయంగా కీలక పరిణామాలకు దారి తీస్తుందా అనేది చూడాలి.












Click it and Unblock the Notifications