హైదరాబాద్ హోటల్లో విశాఖ యువతి ఆత్మహత్య: ఆలోచింపజేసేలా సూసైడ్ నోట్
హైదరాబాద్: షేర్ల వ్యాపారంలో నష్టం వచ్చిందని మనస్తాపం చెందిన విశాఖపట్టణానికి చెందిన ఓ యువతి హైదరాబాద్ హైటెక్సిటీ ప్రాంతంలోని హోటల్లో ఆత్మహత్యకు పాల్పడింది.
ముంబై స్టాక్ మార్కెట్లో షేర్ల వ్యాపారం చేస్తున్న ఈ యువతి నష్టాలు రావడంతో తీవ్ర మనస్తాపం చెంది హోటల్లోని స్నానాల గదిలో చున్నీతో ఉరివేసుకొన్నారు. మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జూన్ 6న హైదరాబాద్కు..
ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్టణంలోని సీతమ్మధారకు చెందిన వేంకటేశ్వరరావు కుమార్తె కొంగర సుష్మ(27) రెండేళ్లుగా షేర్ల వ్యాపారం చేస్తూ ముంబైలో ఉంటున్నారు. పని నిమిత్తం జూన్ 6న మాదాపూర్ వచ్చిన ఆమె పత్రికానగర్లోని రెయిన్ట్రీ హోటల్ రూం-502లో దిగారు.
బాత్రూంలో ఉరివేసుకుని..
శుక్రవారం రాత్రి 11 గంటలప్పుడు హోటల్ సిబ్బంది ఆమె గది దగ్గరకు వెళ్లి ఎంత పిలిచినా సుష్మ తలుపులు తీయలేదు. అనుమానం వచ్చిన సిబ్బంది తలుపులు బద్దలు కొట్టి, లోపలికి వెళ్లి చూశారు. బాత్రూంలో ఇనుప కడ్డీకి చున్నీతో ఉరివేసుకొని వేలాడుతూ సుష్మ కనిపించారు. వెంటనే పోలీసులకు హోటల్ సిబ్బంది సమాచారం అందించారు.
ఎవరూ కారణం కాదంటూ..
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తన చావుకు ఎవరూ కారణం కాదని, వ్యాపారంలో నష్టాల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సుష్మ రాసిన మూడు పేజీల లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఆలోచింపజేసేలా సూసైడ్ నోట్
తాను మరణించాక తన అవయవాలను దానం చేయాలని సుష్మ లేఖలో రాశారు. ఆత్మహత్య చేసుకోవడానికి ఏన్నో మార్గాలు ఉన్నా, శరీరంలో ఎక్కువ అవయవాలు చెడిపోయే అవకాశం లేనందునే ఉరి వేసుకుంటున్నాని లేఖలో తెలిపింది. ‘అమ్మానాన్న, అన్న.. మిమ్మల్ని మధ్యలోనే వదిలేసి వెళ్తున్నందుకు క్షమించండి' అని లేఖలో పేర్కొంది సుష్మ. కాగా, తాను మరణిస్తూ కూడా తన అవయవాలు ఇతరులకు ఉపయోగపడతాయని ఆలోచించడం సుష్మ మంచి తనానికి నిదర్శనంగా నిలుస్తోంది.