జల్సాలకు అలవాటుపడి.. కన్న తండ్రినే బ్లాక్మెయిల్ చేసిన తనయుడు
హైదరాబాద్: జల్సాలకు అలవాటుపడిన ఓ ప్రైవేటు ఉద్యోగి తన కన్న తండ్రినే బ్లాక్ మెయిల్ చేసి రూ. 1.93లక్షలు కాజేశాడు. సదరు ప్రబుద్ధుడ్ని పట్టుకున్న పంజాగుట్ట పోలీసులు రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. ముంబైకి చెందిన విజయ్(రోహన్) బంజారాహిల్స్ రోడ్ నెం.2లో హాస్టల్లో ఉంటూ సోమాజిగూడలోని ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.
కార్లలో తిరగడం, ఖరీదైన హోటళ్లలో బస చేసి జల్సాలు చేయడం ఇతనికి అలవాటుగా మారింది. దీంతో తన వద్ద ఉన్న డబ్బు సరిపోకపోవడంతో డబ్బు సంపాదించేందుకు పిచ్చి ఆలోచనలు చేశాడు. ఫిబ్రవరి 16న తన ఫోన్ నుంచే ముంబైలో ఉండే తన తండ్రికి ఫోన్ చేశాడు. డబ్బు కోసం కొందరు తనను కిడ్నాప్ చేశారని, వెంటనే తన బ్యాంకు ఖాతాలో డబ్బు వేయాలని ఒత్తిడి చేశాడు.

అంతేగాక, ఈ విషయం ఎవరికైనా చెప్తే కిడ్నాపర్లు చంపేస్తారని, ఎవరికీ చెప్పవద్దని తండ్రికి చెప్పాడు. దీంతో భయాందోళనకు గురైన తండ్రి ఆ మొత్తం డబ్బును అతని ఖాతాలో వేశాడు. కాగా, 16వ తేదీ నుంచి గత శుక్రవారం వరకు రూ. లక్షా 93వేలతో జల్సాలు చేశాడు విజయ్.
డబ్బు అయిపోవడంతో కిడ్నాపర్లు మళ్లీ తనను కిడ్నాప్ చేశారని తన తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన ఆయన నేరుగా హైదరాబాద్ నగరానికి వచ్చారు. విజయ్కు ఫోన్ చేసి ఎక్కడున్నావని అడిగితే పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అతను పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టి అతని కొడుకే కిడ్నాప్ డ్రామా ఆడారని తేల్చారు. విజయ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications