జగన్ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎదుట అనంతపురం జిల్లాకు చెందిన యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గురువారం వార్తలు వచ్చాయి. మీడియాలో వచ్చిన వార్తాకథనలా ప్రకారం - తనకు ఉద్యోగం ఇస్తామని ఆశ చూపించి, ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు తన చేత పార్టీ కోసం రూ. 4 లక్షలు ఖర్చుపెట్టించారని యువకుడు ఆరోపించాడు.
డబ్బు కోసం పలుమార్లు లోటస్ పాండ్లోని జగన్ను కలిసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని అంటూ పార్టీ ఓటమితో తన డబ్బు తిరిగి రాదని మనస్తాపంతో జగన్ ఎదుటే ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అనంతపురం జిల్లా కళ్యాదుర్గానికి చెందిన నాగరాజు అనే యువకుడు రెండు రోజుల క్రితం హైదరాబాద్లోని లోటస్పాండ్లోని వైసీపీ కార్యాలయంలో జగన్ ఎదురుగానే విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
దీంతో అక్కడ ఉన్న జగన్ అనుచరులు యువకుడిని కారులో వేసుకుని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న నాగరాజుకు అయిన ఖర్చు కూడా జగన్ అనుచరులే కట్టడం జరుగుతుంది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల మాటలు వినే తాను కూడబెట్టుకున్న డబ్బులు ఖర్చుపెట్టానని, ఇప్పుడు తనకు ఎవరూ సహాయం చేయడం లేదని, తనకు న్యాయం జరగాలని నాగరాజు కోరుతున్నాడు.