కూటమి పై మేనిఫెస్టోలో జగన్ బ్రహ్మాస్త్రం - గేమ్ ఛేంజర్..!!
ఏపీలో ఎన్నికల పోరాటం కీలక దశకు చేరుకుంది. కూటమి వర్సస్ వైసీపీ మధ్య అధికారం కోసం పోరాటం తీవ్ర స్థాయిలో సాగుతోంది. ప్రచారం వైసీపీ, టీడీపీ అధినేతలు ముమ్మరం చేసారు. బస్సు యాత్ర చేస్తున్న జగన్ రాయలసీమలో ముగించుకొని నెల్లూరు మీదుగా ప్రకాశం చేరారు. చంద్రబాబు ఎన్నికల సభలు నిర్వహిస్తున్నారు. అయితే, సీఎం జగన్ తన ఎన్నికల మేనిఫెస్టో ప్రకటనకు సిద్దమవుతున్నారు. ఇందులో పేర్కొనే అంశాలపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది.
హోరా హోరీ పోరు
ఏపీలో ఈ సారి అధికారం సీఎం జగన్..చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. మూడు పార్టీల కూటమితో జగన్ ఓటమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. తాను చేసిన సంక్షేమం -సామాజిక న్యాయం తిరిగి తనకు అధికారం దక్కిస్తాయనే ధీమాతో జగన ఉన్నారు.

టీడీపీ ఈ సారి జగన్ కు పోటీగా సంక్షేమంలో సూపర్ సిక్స్ పేరుతో పథకాలను ప్రకటించింది. అందులో మహిళా ఓట్ బ్యాంక్ ను టార్గెట్ చేస్తూ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ సమయంలోనే జగన్ తాను చేసేదే చెబుతానని..చెప్పింది చేస్తానని..చేసేవే పార్టీ మేనిఫెస్టోలో ఉంటాయని సిద్దం సభా వేదికగా ప్రకటించారు. ఈ ఉగాది నాడే జగన్ తన మేనిఫెస్టో ప్రకటిస్తారని చెప్పినా ఇంకా ఖరారు కాలేదు.
మేనిఫెస్టో పై కసరత్తు
కూటమి లోని మూడు పార్టీలు తమ మేనిఫెస్టో రూపకల్పన పైన ఫోకస్ చేసాయి. జగన్ ఇటు మేనిఫెస్టో పైన ముసాయిదా సిద్దం చేసారు. కానీ, తన బస్సు యాత్ర సమయంలో ప్రజలతో మమేకం అవుతున్నారు. వారు తన నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా మేనిఫెస్టో ప్రకటనకు సిద్దమవుతున్నారు.
పది రోజులుగా జగన్ చేస్తున్న బస్సు యాత్ర సమయంలో ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో రైతు రుణమాఫీ గురించి ప్రధానంగా డిమాండ్ వస్తోంది. చీట్ల ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొనే ప్రయత్నం చేసారు. అందులోనూ మెజార్టీ అభిప్రాయం రైతు రుణమాఫీ కోరుతున్నట్లు పార్టీ నేతల సమాచారం.
రుణమాఫీ పై ఆసక్తి
దీంతో..తొలుత రుణమాఫీ పైన జగన్ సుముఖత వ్యక్తం చేయకపోయినా..వస్తున్న ప్రజాభిప్రాయం మేరకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. రుణమాఫీ మేనిఫెస్టోలో పేర్కొంటే విజయం ఖాయమనే ధీమా వ్యక్తం అవుతోంది. అదే విధంగా డ్వాక్రా మహిళలకు గత ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా రుణమాఫీ చేసారు.
ఈ సారి వారికి ఆర్దికంగా తోడ్పాటు అందించే హామీలు ఉంటాయని సమాచారం. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లను రూ 3 వేల నుంచి దశల వారీగా రూ 4 వేలకు పెంచేలా హామీ ఉంటుందని చెబుతున్నారు. జగన్ రైతు రుణమాఫీ ప్రకటన చేస్తే కూటమి పైన బ్రహ్మస్త్రంగా మారుతుందనే అంచనాలు పార్టీలో వ్యక్తం అవుతున్నాయి. దీంతో..జగన్ ప్రకటించే మేనిఫెస్టో పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications