మూడు నెలల్లో చేస్తా, రెండేళ్లు ఓపిక పట్టండి: జగన్, గోడు విన్నవించుకున్నారు
తాము అధికారంలోకి వస్తే మూడు నెలల్లోనే కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ బుధవారం అన్నారు.
రాజమహేంద్రవరం: తాము అధికారంలోకి వస్తే మూడు నెలల్లోనే కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం అన్నారు.
ఇందుకు అవసరమైతే తాము అధికారంలోకి వచ్చాక కోర్టుకు వెళ్తామని, ఒక్క రెండేళ్లు ఓపిక పట్టాలని వ్యాఖ్యానించారు. ఏళ్ల తరబడి పని చేస్తున్నా తమను రెగ్యులరైజ్ చేయడం లేదని కాంట్రాక్టు లెక్చరర్లు వైయస్ జగన్ వద్ద ఈ రోజు మొరపెట్టుకున్నారు.
జగన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బూరుగుపూడి గ్రామం వద్ద కాంట్రాక్ట్ లెక్చరర్లు కలిశారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు జగన్ను కోరారు. ఈ సందర్భంగా జగన్ వారికి హామీ ఇచ్చారు.
కాగా, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందుతున్న పునరావాసం, సమస్యలపై వారితో చర్చించేందుకు జగన్మోహన్రెడ్డి బుధ, గురువారాల్లో నిర్వాసిత గ్రామాల్లో పర్యటిస్తున్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమహేంద్రవరం వెళ్లారు. ఆ తర్వాత పర్యటన ప్రారంభమైంది.