పనిచేసిన జగన్ మంత్రం-తాత్కాలికంగా తగ్గిన అసంతృప్తులు-సుచరితపై మాత్రం సస్పెన్స్
ఏపీలో కేబినెట్ విస్తరణ అధికార వైసీపీలో రేపిన చిచ్చు క్రమంగా చల్లారుతోంది. కేబినెట్ బెర్తులపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలకు చోటు దక్కకపోయే సరికి నియోజకవర్గాల్లో రాజీనామాలతో మొదలైన అసంతృప్తి పతాకస్దాయికి చేరింది. బాలినేని, ఉదయభాను, పిన్నెల్లి, పార్ధసారధి వంటి నేతలు రాజీనామా అస్త్రాలు ప్రయోగించేందుకు కూడా సిద్ధమయ్యారు. మాజీ హోంమంత్రి సుచరిత అయితే రాజీనామా చేసేశారు కూడా. అయితే వీరిలో సుచరిత మినహా మిగతా వారితో జగన్ చర్చలు సఫలమైనట్లే కనిపిస్తోంది.
దారికొస్తున్న అసంతృప్తులు
ఏపీలో కేబినెట్ విస్తరణతో వైసీపీలో రేగిన అసంతృప్తి క్రమంగా చల్లారుతోంది. ఇప్పటికే కేబినెట్ బెర్తులు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న నేతల్ని ఒక్కొక్కరుగా అధిష్టానం పెద్దలు బుజ్జగిస్తున్నారు. ఓవైపు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మరోవైపు ఎంపీ మోపిదేవి వెంకటరమణ, సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుజ్జగించారు. బాలినేనిని సజ్జల బుజ్జగించగా.. సామినేని ఉదయభాను, పార్ధసారధిని మోపిదేవి బుజ్జగించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పెద్దిరెడ్డి బుజ్జగించారు. చివరికి సీఎం దగ్గరికి తీసుకెళ్లి వీరందరికీ పలు హామీలు ఇప్పించడంతో వారు శాంతించినట్లు తెలుస్తోంది.
జగన్ హామీతో శాంతించిన నేతలు
పార్టీలో ఇప్పటివరకూ కనీవినీ ఎరుగని రీతిలో చెలరేగిన అసంతృప్తితో ఆత్మరక్షణలో పడిన సీఎం జగన్.. కీలక నేతల సాయంతో దాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారు. తొలుత అసంతృప్తులతో పలుమార్లు భేటీలు జరిపిన పార్టీ పెద్దలు.. ఆ తర్వాత వారిని సీఎం జగన్ దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ జగన్ తనదైన శైలిలో వారితో మాట్లాడి హామీలు ఇచ్చారు. భవిష్యత్తులో వారికి తగిన న్యాయం చేస్తానని స్వయంగా పిలిపించుకుని మరీ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. జగన్ ఇచ్చిన హామీలతో నేతలు సంతృప్తి చెందినట్లు సమాచారం.
సుచరితపై మాత్రం సస్పెన్స్
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నలుగురు మంత్రుల్ని కేబినెట్లో కొనసాగించి హోంమంత్రిగా ఉన్న తనను తప్పించడంపై రగిలిపోతున్న మేకతోటి సుచరిత మాత్రం రాజీనామా చేశారు. దీనిపై ఆగ్రహంగా ఉన్న పార్టీ అధిష్టానం ఆమె వద్దకు నేతల్ని కూడా పంపలేదు. తొలుత ఎంపీ మోపిదేవి ఆమెతో మాట్లాడినా ఆ తర్వాత మాత్రం బుజ్జగించేందుకు ప్రయత్నించలేదని తెలుస్తోంది. సీఎం జగన్ ఆదేశాలతో సుచరిత వద్దకు నేతలు కూడా వెళ్లలేదు. దీంతో ఆమె రాజీనామాపైనా తిరిగి ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ నేపథ్యంలో సుచరిత వ్యవహారంపై సస్పెన్స్ కొనసాగుతోంది.