పవన్ కల్యాణ్, నారా లోకేష్ కు వైఎస్ జగన్ చెక్?
జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనవరి నుంచి యాత్రలు చేపట్టబోతున్నారు. పవన్ కల్యాణ్ బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. అందుకు వాహనం కూడా సిద్ధమవుతోంది. పనులన్నీ దాదాపుగా పూర్తికావచ్చాయి. అలాగే నారా లోకేష్ కుప్పం నుంచి పాదయాత్ర చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. పాదయాత్ర పొడవునా ఉపయోగించేందుకు కొత్తగా పాటల రూపకల్పన చేస్తున్నారు.

వార్తల్లో నిలవబోతున్న నేతల యాత్రలు
రాబోయే జనవరి నుంచి ఈ నేతలిద్దరి యాత్రలు వార్తలకెక్కుతాయి. బస్సు యాత్రకానీ, పాదయాత్ర కానీ చేస్తే వాటి ప్రభావం ఎలా ఉంటుందనేది ముఖ్యమంత్రి జగన్ కు తెలుసు. వీరిద్దరి యాత్రలకు తమ నేత చెక్ పెడతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వారిద్దరూ యాత్రను ప్రారంభించే సమయానికి ఏం చేయాలి? ఎటువంటి వ్యూహాలను అమలు చేయాలనేది తమ దగ్గర సిద్ధంగా ఉందని వెల్లడిస్తున్నారు. తమ వ్యూహం ప్రకారం ఒకవేళ వారు యాత్రను ప్రారంభించినా వెంటనే విరమించాల్సిన అవసరం వస్తుందని చెబుతున్నారు.

వ్యూహం సిద్ధంగా ఉంది!
ముఖ్యమంత్రి జగన్ అన్ని జిల్లాల పర్యటనలు పెట్టుకున్నారని, సామాజిక న్యాయభేరి పేరుతో బస్సు యాత్ర జరగబోతోందని వైసీపీ కేంద్ర కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజాప్రతినిధులంతా ప్రజలతో మమేకమై ఉన్నారని, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిచేశామని, కాబట్టి 3 రాజధానులు, సంక్షేమ పథకాలే అజెండాగా ఎన్నికలకు వెళ్లబోతున్నట్లు వివరించారు. ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి ఇబ్బందికరంగానే ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో అది మరింత ఉధృత రూపం దాల్చకుండా ఉండాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఒక్కటే పరిష్కారమని అధినేత భావిస్తున్నట్లు చెప్పారు.

ముందస్తు ప్రకటన రావొచ్చు?
రోజురోజుకు ప్రభుత్వానికి ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. రానున్న ఏడాదిలో ప్రజలకు సంక్షమే పథకాలకు సంబంధించి నిధులు సర్దుబాటు అవుతాయనే నమ్మకం ఉన్నప్పటికీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారని చెబుతున్నారు. పవన్ కల్యాణ్, లోకేష్ యాత్రలు ప్రారంభించగానే ముగించేసేలా ప్లాన్ చేశారని చెబుతున్నారు. అది ఏమిటి అనేది వారు వెల్లడించకపోయినప్పటికీ బహుశా అది ముందస్తు ప్రకటన కావొచ్చని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications