బాబు అబద్ధాలు గిన్నీస్ బుక్లోకి: జగన్, హిందీ స్పీచ్!
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలను నమ్మించడానికి పదే పదే చంద్రబాబు నాయుడు అబద్దాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. ఆయన సోమవారం కుత్బుల్లాపూర్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధాలను గిన్నీస్ బుక్లో ఎక్కించాలని అన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు నిర్మాణంలో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. చంద్రబాబు నాయుడు హయాంలో సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందలేదన్న ఆయన, ఈ రంగ అభివృద్ధిలో రాష్ట్రం మూడవ స్థానం నుంచి ఐదవ స్థానానికి పడిపోయిందని అన్నారు.

తెలంగాణ తన సోదరి షర్మిల ఓదార్పు యాత్రను కొనసాగిస్తారని వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఏదో ఓ రోజు తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విశ్వసనీయ లోపించిందని, రాజకీయాల్లో మార్పు అవసరమని ఆయన అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నేతలు విస్మరిస్తున్నారని, ఎన్నికల ముందు ఒకలా.. తర్వాత మరోలా చెబుతున్నారని జగన్ చెప్పారు.
స్వచ్ఛమైన పాలన కోసం పోటీ చేస్తున్న తమ పార్టీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయారెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. ఐదేళ్లు అధికారం వచ్చినా కాంగ్రెస్ ప్రజలకు ఏం చేయలేదన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి విశ్వసనీయతకు పట్టం కట్టాలని ప్రజలను జగన్ కోరారు. కాగా, ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బిఎస్ మక్తాలో కాసేపు హిందీలో ప్రసంగించిన జగన్ ఆకట్టుకున్నారు.












Click it and Unblock the Notifications