51 నుండి32కు: జగన్పై సబ్బం, హంగ్ అసెంబ్లీయే
విశాఖ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ 32 శాతానికి పడిపోయిందని జై సమైక్యాంధ్ర పార్టీ ఉపాధ్యక్షుడు, అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి శనివారం అన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ కూడా స్పష్టంగా గెలుస్తుందని చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. బలాబలాలపై మరో వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఖాయమన్నారు.
జగన్ గ్రాఫ్ రోజురోజుకీ పడిపోతోందన్నారు. ఆయన జైలులో ఉన్నప్పుడు 51% ఉండగా ఇప్పుడు 32 శాతానికి పడిపోయిందన్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో 200 స్థానాల్లో పోటీచేసే అవకాశం ఉందని, భారీగా దరఖాస్తులు అందుతున్నాయని చెప్పారు.
ఆదివారం నుంచి పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తారన్నారు. తమ పార్టీ 80 శాతం సీట్లు కొత్తవారికి ఇస్తుందని చెప్పారు. పార్టీ అజెండా, మేనిఫెస్టో రూపకల్పనకు కసరత్తు చేస్తున్నామన్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్, బిజెపిల మధ్య చీకటి ఒప్పందం జరిగిందని, ఇందుకు అనేక ఆధారాలున్నాయని ఆరోపించారు.
మన మధ్య జరిగిన ఒప్పందాన్ని బయటపెడతానంటూ వెంకయ్య నాయుడు ఇటీవలే జైరాం రమేశ్ను హెచ్చరించారని, అదే విధంగా లోకసభలో బిజెపి నేత సుష్మాస్వరాజ్ ఆమోదంతోనే స్పీకర్ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేశారని ఆరోపించారు. విభజనపై బిజెపిలోకసభలో ఒక విధంగా, రాజ్యసభలో మరోవిధంగా డ్రామా ఆడిందన్నారు.
ఇప్పుడు విభజనకు తామే కీలకమని తెలంగాణలో, ప్రత్యేక ప్యాకేజీ తమ వల్లే సాధ్యమైందని సీమాంధ్రలో ప్రజలను మభ్యపెడుతున్నదన్నారు. ఆదివారం వైజాగ్లో విద్యార్థి గర్జన ఏర్పాటు చేశామని తెలిపారు. కిరణ్తోపాటు తమ నేతలంతా హాజరవుతారని చెప్పారు. సిఎంగా ఉన్నపుడు మహిళలు, విద్యార్థులు, యువత కోసం కిరణ్ కృషి చేశారని, వారంతా అండగా ఉండాలని పిలుపు నిచ్చారు. కాగా కిరణ్ ఈనెల 17న శ్రీకాకుళం జిల్లాలో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.