ఎమ్మెల్యేలను నించోబెట్టిన జగన్: టిడిపికి దొరికిన అస్త్రం
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజకీయ అస్త్రాన్ని అందించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ కుమార్ చేసిన విమర్శ ఈ విషయాన్ని పట్టిస్తోంది. శాసనసభలో అధికార తెలుగుదేశం పార్టీ తీరును, స్పీకర్ కోడెల శివప్రసాద్ వివక్షను ప్రశ్నిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు శాసనసభ సమావేశాలను బహిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ శుక్రవారంనాడు హైదరాబాదులోని లోటస్పాండ్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్పై మీడియా సమావేశంలో ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఆయన సమావేశం మధ్యాహ్నం ఒంటిగంటన్నర తర్వాత ముగిసింది. ఇంత సేపూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ఆయనకు ఇరువైపులా నించొనే ఉన్నారు. మీడియా సమావేశానికి ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. జగన్ కూర్చుని ఉండగా, శాసనసభ్యులు మాత్రం నించున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత సుదీర్ఘంగా తాను మాట్లాడడంపై జగన్ హాస్యం కూడా ఆడారు. మీరు ఏమీ అనలేదు కాబట్టి ఇంతగా మాట్లాడానని ఆయన అన్నారు.
మధ్యలో మీడియా ప్రతినిధులు కూడా ఏమీ మాట్లాడలేదు. తాను చెప్పాల్సిన విషయాలన్నింటినీ జగన్ చెప్పేసి, ప్రశ్నలు వేయడానికి కూడా వారికి అవకాశం ఇవ్వలేదు. తాను చెప్పాల్సింది చెప్పి వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు విసుర్లు కూడా విసిరారు. జగన్ చేసిన విమర్శలపై కూడా ఆయన ఎమ్మెల్యేలను నిలబెట్టడాన్ని తెలుగుదేశం పార్టీ కేంద్ర బిందువు చేసి విమర్శలు చేస్తోంది.
బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను నిలువు కాళ్లపై నించోబెట్టి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్ మూడు గంటలపాటు విలేకర్ల సమావేశంలో మాట్లాడడం ఆయన ప్యూడల్ మనస్తత్వానికి నిదర్శనమని మంత్రి రావెల కిశోర్ బాబు మండిపడ్డారు. అసెంబ్లీలో వైసీపీకి చెందిన దళిత ఎమ్మెల్యేలు మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వకుండా సమయం మొత్తాన్ని జగనే వాడుకున్నారని విమర్శించారు.
మహిళా ఎమ్మెల్యే రోజా రెడ్డితో టీడీపీ దళిత మంత్రి పీతల సుజాతపై అసత్య ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే బడుగు, బలహీన వర్గాలను సమానంగా చూస్తారని, జగన్ మాత్రం నేనొక్కణ్ణే కుర్చీలో కూర్చోవాలి, నా పక్కన ఎవరూ కూర్చోకూడద'నే భావనతో ఉన్నారని దుయ్యబట్టారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను దారి మళ్లించి వైఎస్ మోసం చేస్తే ఇప్పుడు ఆయన కుమారుడు దళితులను దగ్గరికి కూడా రానివ్వకుండా, కుర్చీల్లో కూర్చోనివ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. రాచరికపు పోకడలకు కేరాఫ్ అడ్ర్సగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు.