రేపు ఢిల్లీకి జగన్-ప్రధాని మోడీతో భేటీ- ముందస్తు ఎన్నికలపై తేల్చేస్తారా?
ఏపీ సీఎం వైఎస్ జగన్ దావోస్ టూర్ నుంచి నిన్న తిరిగొచ్చారు. ఒక్కరోజు విశ్రాంతి తీసుకుని తిరిగి ఢిల్లీకి పయనం కాబోతున్నారు. ప్రధాని మోడీతో పాటు ఇతర కేంద్రమంత్రుల్ని కలిసి రాష్ట్ర సమస్యల్ని వివరించనున్నారు. అయితే అన్నింటికంటే ముఖ్యంగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో వీటిపై క్లారిటీ కూడా ఇవ్వబోతున్నారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
రేపు హస్తినకు జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు ఢిల్లీ టూర్ కు వెళ్లబోతున్నారు. తాజాగా దావోస్ లో పది రోజుల పర్యటన పూర్తి చేసుకున్న సీఎం జగన్ పెట్టుబడుల ఆకర్షణ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. నిన్న రాష్ట్రానికి తిరిగొచ్చిన జగన్.. అంతకు ముందే ఢిల్లీలో ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని అపాయింట్ మెంట్ ఖరారు కావడంతో సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఖరారు చేసుకున్నట్లు సమాచారం. ఈసారి పర్యటనలో సీఎం జగన్ ప్రధానితో పలు కీలక విషయాలు చర్చించబోతున్నారు.
ప్రధాని మోడీతో భేటీ
ప్రధాని మోడీతో భేటీకి సీఎం జగన్ ప్రధానంగా ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇధి ముగిసిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిష్ షాతో పాటు మిగిలిన కేంద్రమంత్రుల అపాయింట్ మెంట్ దొరికితే వారిని కూడా కలిసే అవకాశం ఉంది. అయితే ప్రధానితో జరిగే భేటీలో జగన్ చర్చించే అంశాలపైనే ప్రధానంగా ఉత్కంఠ నెలకొంది.
ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలు, ఆర్ధిక అంశాలు ఎలాగో ప్రధానితో చర్చిస్తారు. దీనికి మించి చర్చించే అంశాలపైనే ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.
ముందస్తుకు ఒప్పిస్తారా?
ప్రధాని మోడీతో భేటీలో సీఎం జగన్ ప్రధానంగా దావోస్ టూర్ కు సంబంధించిన అప్ డేట్స్ తో పాటు రాష్ట్రానికి సంబంధించి పోలవరం, ఇతర ప్రాజెక్టులు, వాటికి ఆర్ధిక సాయం వంటి అంశాలపై ఎలాగో చర్చిస్తారు. వీటితో పాటు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రధానికి జగన్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ముందస్తు ఎన్నికల అంచనాలతోనే వైసీపీ రాష్ట్రంలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. ఇందుకు తగినట్లుగానే విపక్షాలు కూడా జనంలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ప్రధానిని ముందస్తు ఎన్నికలపై ఒప్పిస్తే ఆ తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారే అవకాశం ఉంది. దీంతో జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది.