జగన్ ప్లాన్: రాజ్యసభకు విజయసాయి, వారికి చేయి..!
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయ సాయి రెడ్డిని రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ ఆస్తుల కేసులో విజయ సాయి ఏ2గా ఉన్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన విజయ సాయికి జగన్ ఇటీవలే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టారు.
వాస్తవానికి విజయ సాయి రెడ్డి గత ఎన్నికల బరిలోనే రంగంలోకి దిగాలనుకున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి పోటీ చేసేందుకు ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ సమీకరణాలు కుదరక పోవడంతో చివరి నిమిషంలో వెనక్కి పోయింది. అప్పుడే జగన్ రాజ్యసభ హామీని విజయసాయికి ఇచ్చారట.

విజయ సాయిని రాజ్యసభకు పంపడం కోసం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారంటున్నారు. సాధారణంగా ఏ పార్టీలోనైనా కీలక వ్యక్తులకే రాజ్యసభ సీటు ఇస్తారు. విజయ సాయిని నేరుగా రాజ్యసభకు పంపిస్తే ఇంటా బయట విమర్శలు వచ్చే ప్రమాదముందని భావించే, జగన్ ఇటీవల ఆయనకు ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టారనే ప్రచారం జరుగుతోంది.
కొన్నాళ్లు ప్రధానకార్యదర్శిగా పని చేసిన తర్వాత రాజ్యసభకు పంపిస్తే, ఎటువంటి విమర్శలు రావనే ఆలోచనలో జగన్ ఉన్నారంటున్నారు. గతంలో వైయస్ హయాంలో విజయ సాయి రెడ్డి టీటీడీ సభ్యుడిగా పని చేశారు. ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు విజయ సాయిని రాజ్యసభకు పంపించవచ్చునని జగన్ భావిస్తున్నారంటున్నారు.
మరో ఇద్దరు ప్రధాన కార్యదర్శులు ధర్మాన ప్రసాద రావు, మోపిదేవి వెంకటరమణలు జగన్ అక్రమార్కుల కేసులో నిందితులు. వీరు ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చారు. పాత అనుబంధంతోనే వారికి పెద్దపీట వేశారంటున్నారు. భూమన కరుణాకర్ రెడ్డిని ప్రధాన కార్యదర్శిగా నియమించడం పైన కూడా భిన్నవాదనలు వినిపిస్తున్నాయంటున్నారు. వైయస్ మృతి తర్వాత జగన్కు మొదటి నుండి అండగా నిలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్, కొణతాల రామకృష్ణ వంటి నేతలకు గుర్తింపు ఎందుకివ్వలేదనే చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications