ఏపీలో భారీ వర్షాలు, ప్రమాద ఘటనలపై స్పందించిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో కుండపోత వర్షాలతో ప్రజలు వణికిపోతున్నారు. రికార్డు స్థాయిలో వర్షపాతాలు నమోదవుతుండగా ఏపీలో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి ప్రధాన రహదారులు నిటమునిగాయి. దీంతో విజయవాడ గుంటూరు జిల్లాలలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఏపీలో అత్యధిక వర్షపాతం ఇక్కడే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీరులపాడులో అత్యధికంగా 21 సెంటీమీటర్ల వర్షపాతం, కంచికచర్లలో 20.3 సెంటీమీటర్ల వర్షపాతం, ఇబ్రహీంపట్నంలో 15.3 సెంటీమీటర్ల వర్షపాతం, నందిగామలో 13.8 సెంటీమీటర్ల వర్షపాతం, విజయవాడలో 13.5 సెంటీమీటర్ల వర్షపాతం, గంపలగూడెంలో 13.1 సెంటీమీటర్ల వర్షపాతం, చందర్లపాడు లో 11 సెంటీమీటర్ల వర్షపాతం, జగ్గయ్యపేట విస్సన్నపేటలలో 8.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.

ప్రమాద ఘటనలపై మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి
నేడు, రేపు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది ప్రాణాలు కోల్పోవడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వివిధ ఘటనలలో మృతి చెందిన వారిపై విచారం
మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా విజయవాడలో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందడం భాదాకరమన్నారు.గుంటూరు జిల్లా ఉప్పలపాడులో కారు వరద నీటిలో కొట్టుకుపోయిన ఘటనలో ఉపాధ్యాయుడు, ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్న వైఎస్ జగన్
మంగళగిరి జిల్లా గండాలయ్యపేటలో మరోసారి కొండచరియలు విరిగిపడి వృద్ధురాలు మృతి చెందడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనల్లో బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని వైఎస్ జగన్ కోరారు. బాధిత ప్రాంతాల్లో, ముఖ్యంగా విజయవాడ మరియు చుట్టుపక్కల, పరిస్థితి క్లిష్టంగా ఉన్న చోట, తక్షణ మరియు తీవ్రమైన సహాయక చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ విపత్తు సమయంలో బాధితులకు అండగా నిలవాలని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications