నేను ఏదీ చెప్పను: రోజా ఇష్యూపై జగన్, మన తప్పుల వల్లే: బాబు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ ఇష్యూ, హైకోర్టు తీర్పు పైన మంగళవారం నాడు స్పందించారు. కోర్టు తీర్పు పైన తాను కామెంట్ చేయలేనని చెప్పారు. న్యాయ నిపుణులతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామన్నారు.
అంతకుముందు జగన్ మాట్లాడుతూ.. ప్రాజెక్టులు నిర్మించిన ఘనత దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిదే అన్నారు. చంద్రబాబు హయాంలో కేటాయింపులు అంతమంత మాత్రంగానే జరిగాయన్నారు. చంద్రబాబు అంతకుముందు అసెంబ్లీలో మాట్లాడారు.
నీటి వినియోగంలో ప్రజలకు అవగాహన పెరగాలన్నారు. ప్రపంచ జల దినోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. నీటి వినియోగంపై ప్రజలకు అవగాహన పెరగాలన్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఐదారెళ్లలో కరువు రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామన్నారు. నదుల అనుసంధాన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. రాయలసీమలో బంగారం పండే భూములు ఉన్నాయి. కానీ నీరు లేక ఎండిపోతున్నాయన్నారు. రాయలసీమ ఆర్థిక హబ్గా తయారై ప్రపంచానికి తలమానికం అవుతుందన్నారు.
ప్రపంచానికి నీరే జీవనాధారం అన్నారు. మనిషి చేస్తున్న తప్పులతో జల వనరులు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నదుల అనుసంధానం ద్వారా గోదావరి నీళ్లు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా నదికి తరలించగలిగామన్నారు.
రాబోయే రోజుల్లో కృష్ణా నుంచి పెన్నాకు నీళ్లు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలన్నారు. భూమి పైన పడే ప్రతి నీటి చుక్కను భద్రపరుచుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కొంతమంది తుపాకులతో ప్రాణాలు తీస్తే, తాము మాత్రం రెయిన్ గన్స్తో పంటలు కాపాడేందుకు ఉపయోగిస్తున్నామని నవ్వుతూ చెప్పారు. కాగా, శాసన సభ శనివారానికి వాయిదా పడింది.