జన్మదిన శుభాకాంక్షలు నాన్నా- వైఎస్సార్ జయంతి సందర్భంగా జగన్ ఎమోషనల్ ట్వీట్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన దివంగత వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు, మంత్రులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఇడుపుల పాయలోని వైఎస్సార్ ఘాట్ కు వెళ్లి ఆయన తనయుడు, సీఎం జగన్ నివాళులు అర్పించనున్నారు.
తన తండ్రి దివంగత వైఎస్సార్ జయంతి సందర్భంగా సీఎం జగన్ భావోద్వేగంతో కూడిన ట్వీట్ పెట్టారు. ఇందులో తండ్రి వైఎస్సార్ వారసుడిగా ఆయన నుంచి పుణికిపుచ్చుకున్న లక్షణాలను, ముఖ్యంగా వైఎస్సార్ అంటే గుర్తుకొచ్చే చెరగని చిరునవ్వును జగన్ గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ బాటలోనే తాను పాలన సాగిస్తున్నట్లు ఈ ట్వీట్ లో జగన్ తెలిపారు. దీంతో జగన్ ట్వీట్ బాగా వైరల్ అవుతోంది.
"చెదరని చిరునవ్వే నువ్వు పంచిన ఆయుధం. పోరాడే గుణమే నువు ఇచ్చిన బలం మాట తప్పని నైజం నువు నేర్పిన పాఠం. నీ ఆశయాలే నాకు వారసత్వం. ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో నిను చూస్తున్నా.. పాలనలో ప్రతిక్షణం నీ అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నా.. జన్మదిన శుభాకాంక్షలు నాన్నా... " అంటూ వైఎస్ జగన్ తన ట్వీట్ లో తన తండ్రి వైఎస్సార్ ను గుర్తు చేసుకున్నారు. ఆ విధంగా వైఎస్సార్ జయంతి రోజు జగన్ ఘనంగా నివాళులు అర్పించారు.