నెల్లూరుపై జగన్ సీరియస్ ? ద్విముఖ వ్యూహం రెడీ - చెక్ పెట్టబోతున్నారిలా..!
నెల్లూరు వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆగ్రహంగా ఉన్న జగన్.. రెబెల్స్ కు చెక్ పెట్టేందుకు ద్విముఖ వ్యూహం సిద్ధం చేశారు. ట్యాపింగ్ ఉచ్చు నుంచి బయటపడటంతో పాటు రెబెల్స్ కు అన్ని దారులు మూసేయబోతున్నారు.
గత ఎన్నికల్లో తమకు వందశాతం సీట్లు ఇచ్చిన నెల్లూరు జిల్లాలో తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేల తిరుగుబాటుతో చెలరేగిన సంక్షోభాన్ని సీఎం జగన్ సీరియస్ గా తీసుకున్నారు. రెబెల్స్ ఇద్దరికీ చెక్ పెట్టటంతో పాటు భవిష్యత్తులో అధికార పార్టీపై వారు బురదజల్లకుండా చేసేందుకు ద్విముఖ వ్యూహం సిద్ధం చేశారు. నిన్న పార్టీ నేతలు, ప్రభుత్వ అధికారులతో వరుస భేటీలు నిర్వహించిన జగన్.. ఈ మేరకు తన వ్యూహం అమల్లో పెట్టేసినట్లు తెలుస్తోంది.
నెల్లూరు పాలిటిక్స్ పై జగన్
నెల్లూరులో పెద్దరెడ్ల పోరు వైసీపీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఏ రెడ్ల అండతో అయితే నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్ని వైసీపీ క్లీన్ స్వీప్ చేసిందో అదే రెడ్లు ఇప్పుడు పార్టీకి ఎదురు తిరుగుతుండటం, దీనికి ఫోన్ ట్యాపింగ్ సాకును జత చేయడంతో పార్టీతో పాటు ప్రభుత్వం కూడా ఇరుకునపడుతోంది. దీంతో సాధ్యమైనంత త్వరగా ఈ తిరుగుబాట్లకు చెక్ పెట్టడంతో పాటు తిరిగి ఫోకస్ ను ఇతర అంశాలపైకి మళ్లించేందుకు జగన్ రంగంలోకి దిగారు. నిన్న పార్టీ నేతలు సజ్జల, బొత్స, అనిల్ వంటి వారితో పాటు హోం కార్యదర్శి, ఇంటెల్ ఛీఫ్ తోనూ జగన్ కీలక చర్చలు జరిపారు. అనంతరం కీలక వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ట్యాపింగ్ జరగలేదని నిరూపించే యత్నం
నెల్లూరు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు ఆనం రామనారాయణరెడ్డి కూడా తమ ఫోన్లు ఏడాదిగా ట్యాప్ అవుతున్నాయంటూ చేస్తున్న ఆరోపణలతో వైసీపీతో పాటు ప్రభుత్వం కూడా ఇరుకున పడింది. దీంతో ఇప్పుడు ట్యాపింగ్ చేయడం లేదంటూ నిరూపించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నిన్న ట్యాపింగ్ విమర్శలపై దర్యాప్తు చేయాలంటూ హోంసెక్రటరీతో పాటు ఇంటెల్ ఛీఫ్ కూ జగన్ ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఓ ఫోన్ రికార్డింగ్ ను పట్టుకుని కోటంరెడ్డి ట్యాపింగ్ పేరుతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారో ఆ రికార్డ్ చేసిన ఆయన స్నేహితుడు రామశివారెడ్డిని మీడియా ముందుకు తెచ్చేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇప్పటికే ఆయన కాల్ డేటాను పోలీసులు విశ్లేషించే పనిలో ఉన్నారు.
కోటంరెడ్డి స్ధానంలో ఇన్ ఛార్జ్ ఎంపికతో చెక్ ?
ఓవైపు కోటంరెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు అబద్దమని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం.. మరోవైపు ఆయన స్ధానంలో నెల్లూరు రూరల్ ఇన్ ఛార్జ్ నియామకంపై దృష్టిసారించింది. ఈ మేరకు ఇవాళ జగన్ నెల్లూరు నేతలతో కీలక భేటీ నిర్వహించబోతున్నారు. అనంతరం ఇన్ ఛార్జ్ పేరును ప్రకటించబోతున్నారు. ఇప్పటికే నెల్లూరు ఎంపీ ఆదాలతో పాటు సిటీ ఎమ్మెల్యే అనిల్, ఆనం విజయ్ కుమార్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్న జగన్.. వీరిలో ఒకరిని ఇవాళ ఎంపిక చేయబోతున్నారు. దీంతో కోటంరెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ అబద్ధమని తేల్చడంతో పాటు ఇన్ ఛార్జ్ నియామకం ద్వారా ఆయన ఆరోపణలకు విశ్వసనీయత లేకుండా చేయాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.