జగన్ తీరుపై విధేయుల్లో షాక్ ? కేబినెట్ తో గట్టి సంకేతాలు ! టికెట్లు వారికిచ్చేస్తే?
ఏపీలో సీఎం జగన్ తాజాగా చేపట్టిన కేబినెట్ ప్రక్షాళన రాష్ట్రానికే కాదు వైసీపీకే అంతుబట్టలేదు. అంతే కాదు సీఎం జగన్ ఎన్నడూ లేనంత కొత్తగా నిర్ణయాలు తీసుకున్నారు. సంచలనాలకూ తెరలేపారు. అంతిమంగా తన ప్రాధాన్యతలు ఏంటో చెప్పేశారు. ఎన్నికల కేబినెట్ గా భావిస్తున్న ఈ మంత్రివర్గ కూర్పు ద్వారా భవిష్యత్ సంకేతాలు కూడా ఇచ్చేశారు. దీంతో జగన్ నిర్ణయాలు పార్టీలో భవిష్యత్తులో టికెట్లు ఆశిస్తున్న వారితో పాటు చాలా మందికి గుబులు రేపేలా చేస్తున్నాయి.
రూటు మార్చేసిన జగన్
ఏపీలో తాజా కేబినెట్ విస్తరణ జగన్ ప్రాధాన్యతల్ని బయటపెట్టింది. ఇంతకాలం వైసీపీ కానీ, జగన్ కానీ చెప్తున్న మాటలకూ ఈ కేబినెట్ ప్రక్షాళనతో చెక్ పడినట్లయింది. దీంతో విధేయులంతా అనూహ్యంగా షాక్ కు గురయ్యారు. విధేయత కంటే సామాజిక న్యాయానికే పెద్దపీట వేయడం ద్వారా జగన్ తన ప్రయారిటీ ఎంటో తేల్చిచెప్పేశారు.
కేబినెట్ కూర్పును కుల సమీకరణాల్ని దృష్టిలో పెట్టుకుని చేయడం ద్వారా తనకు అన్నింటి కంటే సామాజిక న్యాయమే ముఖ్యమన్న సంకేతాల్ని జగన్ వైసీపీ నేతలకు పంపేశారు. దీంతో ఇకపై తీసుకునే నిర్ణయాలన్నీ అదే యాంగిల్ లో ఉంటే తమ పరిస్ధితి ఏంటనే ఆందోళన వారిలో మొదలైంది.
సామాజిక న్యాయానికి ప్రాధాన్యం
గతంలో వైసీపీ తీసుకున్న నిర్ణయాల్లో అతి ముఖ్యమైన అంశం విధేయత. జగన్ గతంలో కేటాయించిన టికెట్లు చూసినా, తొలి కేబినెట్లో కట్టబెట్టిన మంత్రి పదవులు చూసినా ఇందులో విధేయతకే ప్రాధాన్యం దక్కేది. అదే సమయంలో సామాజిక న్యాయానికీ తగిన ప్రాధాన్యం ఇచ్చేవారు.
కానీ ఈసారి మాత్రం విధేయత కంటే సామాజిక న్యాయమే ముఖ్యమన్న రీతిలో జగన్ కేబినెట్ ప్రక్షాళన చేశారు. దీంతో కేబినెట్ పై ఈసారి విధేయత మార్క్ కంటే సామాజిక న్యాయం మార్క్ కనిపించింది. కేబినెట్ అంతా ఎటు చూసినా బీసీలు, ఎస్సీ, ఎస్టీలే కనిపిస్తున్నారు. కీలక పదవులన్నీ వారికే దక్కాయి. ఇది అంతిమంగా వైసీపీ నేతల్లో భవిష్యత్తుపై ఆందోళన రేపుతోంది.
విధేయతకు మంగళం
జగన్ తీసుకున్న సామాజిక న్యాయం నిర్ణయంతో ఈసారి ఆయనతో ముందునుంచీ ప్రయాణిస్తున్న చాలా మంది విధేయులకు షాకులు తప్పలేదు. వీరిలో చాలా మంది జగన్ వైసీపీ ప్రారంభించగానే మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు, పార్టీ పదవులు వదులుకుని ఆయనతో నడిచిన వారే. ఇలాంటి వారిలో కేబినెట్ లో కచ్చితంగా చోటు దక్కుతుందని ఆశించిన పిన్నెల్లి, పార్ధసారధి, బాలినేని, ప్రసాదరాజు, ఉదయభాను వంటి వీర విధేయులెందరికో నిరాశ తప్పలేదు. అదే సమయంలో పాత వారిని కొనసాగించాల్సిన పరిస్ధితులు జగన్ చేతుల్ని పూర్తిగా కట్టిపాడేశాయి.
దీంతో వైసీపీలో ఎన్నడూ లేనంతగా విధేయులకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
వైఎస్ బాట వీడుతున్నారా?
గతంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రాష్ట్ర రాజకీయాల్లో పేరు తెచ్చిన మంత్రం విధేయులకు ప్రాధాన్యం. వైఎస్ తన విధేయులకు మాటిచ్చారంటే ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాదనే పేరు తెచ్చుకున్నారు. విధేయతకు వైఎస్ ఇచ్చిన ప్రాధాన్యం అప్పటివరకూ ఏపీ రాజకీయాల్లో అందరి కంటే ఎక్కువనే మాట వినపించేది.
ఆ తర్వాత జగన్ కూడా వైఎస్ బాటలోనే విధేయులకు పెద్దపీట వేస్తూ వచ్చారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు, సీబీఐ కేసుల్లో ఇరుక్కుని జైలుకెళ్లినప్పుడు అండగా నిలిచిన వారికే జగన్ గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లతో పాటు తొలికేబినెట్లో మంత్రి పదవులు కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు తాజా కేబినెట్ ప్రక్షాళన చూస్తే అలాంటి వారు కేబినెట్లో ఎంతమంది ఉన్నారో వేళ్ల మీద లెక్కబెట్టాల్సిందే.
ఇక టికెట్లూ వారికేనా?
ప్రస్తుతం కేబినెట్ ప్రక్షాళనలో జగన్ సామాజిక న్యాయానికి ఇచ్చిన ప్రాధాన్యం గమనిస్తే విధేయులకు దారులు మూసుకుపోతున్నట్లే కనిపిస్తోంది. కుల సమీకరణాలు ఎక్కువగా ఉండే ఏపీలో సామాజిక న్యాయం పేరుతో ప్రభావం చూపే కులాలకు టికెట్లు ఇస్తే చాలు ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేస్తామనే ధోరణి వైసీపీలో కనిపిస్తోంది.
దీంతో భవిష్యత్తులో అసెంబ్లీ టికెట్లు, ఎంపీ టికెట్లు కూడా కులసమీకరణాల ఆధారంగానే జగన్ కేటాయించే అవకాశాలున్నాయి. సరిగ్గా ఇదే అంశం వైసీపీ, జగన్ విధేయుల్ని కలవరపెడుతోంది. భవిష్యత్తులో సామాజిక న్యాయం పేరుతో తమకు టికెట్లు కూడా నిరాకరిస్తే ఏం చేయాలన్న దానిపై వారు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు.