నిమ్స్కు వైయస్ జగన్ తరలింపు: దీక్ష భగ్నం
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నిరాహార దీక్షను భగ్నం చేశారు. గత ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న జగన్ను పోలీసులు బలవంతంగా నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ జగన్ చేపట్టిన దీక్ష బుధవారం ఐదో రోజుకు చేరుకుంది. నిమ్స్ ఆస్పత్రిలో జగన్కు వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు.
దీక్షలో ఫ్లూయిడ్స్ తీసుకోవాలని చేసిన సూచనను జగన్ దీక్షా శిబిరంలో నిరాకరించారు. రాత్రి పది గంటల ప్రాంతంలో పోలీసులు భారీ సంఖ్యలో దీక్షా శిబిరానికి చేరుకున్నారు. జగన్ను తరలించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కొడాలి నాన తదితరులు అడ్డుకునే ప్రయత్నం చేసినా, పోలీసులు ఆయనను బలవంతంగా అంబులెన్స్లో ఎక్కించారు. దీక్షా శిబిరం నుంచి వైయస్ జగన్ను తరలించారు.
సమైక్యాంధ్ర నినాదంతో వైయస్ జగన్ గత ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. సతీమణి భారతి, మామ గంగిరెడ్డి వచ్చి జగన్ను పరామర్శించారు. జగన్ ఆరోగ్యం పట్ల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా, కడప జిల్లా జమ్మలమడుగు కాంగ్రెసు శాసనసభ్యుడు బుధవారం వైయస్ జగన్ దీక్షకు మద్దతు తెలిపారు. ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామిరెడ్డి కూడా దీక్షా శిబిరంలో వైయస్ జగన్ను పరామర్సించారు. సమైక్యాంధ్ర కోసం పాటుపడుతున్న ఏకైక నాయకుడు జగన్ అని ఆయన ప్రశంసించారు. ఆయన కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశం ఉంది.