YS Jagan: నేడు లండన్ కు జగన్...కుటుంబంతో కలిసి 15 రోజుల పాటు యూరప్ లోనే..!
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు. దాదాపు రెండు నెలల పాటు ఎన్నికల వ్యూహాలు, ప్రచారం, పోలింగ్ తో బిజీగా గడిపిన సీఎం జగన్.. ఇప్పుడు కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. యూరప్ లో దాదాపు 15 రోజుల టూర్ ప్లాన్ చేసుకున్న జగన్.. ముందుగా లండన్ లో కుమార్తె వద్దకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అనంతరం మే 31న రాష్ట్రానికి తిరిగి వస్తారు.
సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ప్రచారం, వ్యూహాల్లో బిజీగా మారిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెగని పర్యటనలు జరిపారు. సిద్ధం సభలతో పాటు దాదాపు ప్రతీ నియోజకవర్గాన్నీ చుట్టేశారు. ఆయనతో పాటు సతీమణి భారతి సైతం పులివెందులలో ప్రచారం చేశారు. రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో అంతా తానై జగన్ వైసీపీని గెలిపించేందుకు శ్రమించారు. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో ఫలితాలు వెలువడే వరకూ చేసేదేమీ లేదు. దీంతో విదేశీ పర్యటనకు వెళ్తున్నారు.

ఇవాళ రాత్రి 11 గంటలకు విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి లండన్ వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నవారు. ఆయనతో పాటు సతీమణి భారతి కూడా ఈ టూర్ కు వెళ్తున్నారు. ముందుగా లండన్ లో కుమార్తెను కలిశాక ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ కు వీరు వెళ్లే అవకాశం ఉంది. అధికారికంగా మాత్రం ఈ టూర్ కు సంబంధించిన వివరాలేవీ వెల్లడించడం లేదు. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 31న జగన్ విదేశీ పర్యటన నుంచి తిరిగి వస్తారు. ఇప్పటికే సీబీఐ కోర్టు ఆయనకు విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది.












Click it and Unblock the Notifications