టిలో జగన్ పర్యటన: 5 నుండి ఓదార్పు, ఏం చెప్తారు?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ పైన దృష్టి సారించారు. సమైక్యవాదం వినిపించిన జగన్ చాలాకాలంగా తెలంగాణలో పర్యటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో ఇక తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆయన సోమవారం తెలంగాణ జిల్లా నేతలతో సమావేశమయ్యారు.
మార్చి 4వ తేదీన ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. 5వ తేదీ నుండి నల్గొండ జిల్లాలో ఓదార్పు యాత్ర చేపట్టాలని భావిస్తున్నారు. నల్గొండలో ఐదారు రోజులు ఓదార్పు చేపట్టి, ఆ తర్వాత మరో జిల్లాలోకి ప్రవేశించే అవకాశముంది.
కాగా, ఇన్నాళ్లు సమైక్యవాదం వినిపించిన జగన్ తన పర్యటనలో ఇక అభివృద్ధి, సంక్షేమం, పథకాలను ప్రస్తావించే అవకాశముంది. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని, తాను ఆయన దారిలోనే నడుస్తానని చెప్పనున్నారు. తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని జగన్ చెప్పనున్నారు.
మరోవైపు, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు టిడిపి పార్టీలు ఎన్నికల వ్యూహాలను ఖరారు చేసుకుంటున్నాయి. సీమాంధ్రలో పొత్తుల గురించి ఏ పార్టీ వెంపర్లాడడం లేదంటున్నారు. సీమాంధ్రలో కమ్యూనిస్టుల ఉనికి నామమాత్రమే. ఇక బిజెపి ప్రభావం అంతంత మాత్రమే. బలమైన వైయస్సార్ కాంగ్రెసు, టిడిపి పార్టీలు పట్టించుకోవడం లేదట. సీమాంధ్రలో కొత్త పార్టీ వచ్చినా దాని జోరు ఉండదని టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు భావిస్తున్నాయి.