పోలవరం ప్రాజెక్ట్లో కీలక ఘట్టం: కేంద్రమంత్రితో కలిసి వైఎస్ జగన్ టూర్: అంచనాలకు ఓకే?
అమరావతి: ఏపీ జీవనాడిగా భావిస్తోన్న పోలవరం జాతీయ ప్రాజెక్ట్ నిర్మాణంలో మరో కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా పరిశీలించనుంది. సవరించిన అంచనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న విజ్ఞప్తులపై తుది నిర్ణయాన్ని తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే- రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతుందనే అంచనాలు ఉన్నాయి.
ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ను సందర్శించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పలుమార్లు ఆయన ఈ ప్రాజెక్ట్పై సమీక్షా సమావేశాలను నిర్వహించారు. మూడుసార్లు ప్రాజెక్ట్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతీసారీ ఈ ప్రాజెక్ట్ నిధుల గురించి ప్రస్తావించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్, ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ వద్ద నిధుల గురించి చర్చించారు. అటు రాజ్యసభ, లోక్సభలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. అన్నిరకాలుగా నిధుల కేటాయింపు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకుని రాగలిగారు. ఆ విజ్ఞప్తులు, ఒత్తిళ్లు ఫలించినట్టే కనిపిస్తోన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించనుంది.

ఈ నెల 4వ తేదీన కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెఖావత్ పోలవరం ప్రాజెక్ట్ను సందర్శించనున్నారు. వైఎస్ జగన్తో కలిసి ఈ ప్రాజెక్ట్ను నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ఇప్పటిదాకా చోటు చేసుకున్న నిర్మాణ పనులు, ప్రాజెక్ట్ పురోగతి గురించి ఆరా తీయనున్నారు. జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, జల వనరుల మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొననున్నారు.
ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు సంబంధించిన ఫొటోల ఎగ్జిబిషన్ను అక్కడ ఏర్పాటు చేయనున్నారు. వాటన్నింటినీ పరిశీలించిన అనంతరం ప్రాజెక్ట్ పనులపై అధికారులు కేంద్రమంత్రికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తారని తెలుస్తోంది. 2017-18లో కేంద్ర జలసంఘం 55,548.87 కోట్ల రూపాయలకు సవరించిన అంచనాలను రూపొందించింది. దీన్ని ఆమోదించాలనేది వైఎస్ జగన్ విజ్ఞప్తి. మరోసారి ఇదే అంశాన్ని ఆయన కేంద్రమంత్రి దృష్టికి తీసుకుని రానున్నారు. తన సందర్శన తరువాత గజేంద్రసింగ్ షెఖావత్- సవరించిన అంచనాలపై తుది నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications