హుధుద్: భారీ నష్టమే, ఏపీలో 21 మంది మృతి
హైదరాబాద్/విశాఖపట్నం:ఆంధ్రప్రదేశ్లో హుధుద్ తుఫాను బీభత్సానికి మృతి చెందిన వారి సంఖ్య 21కి చేరుకుంది. విశాఖ జిల్లాలో 15మంది, విజయనంగరంలో ఐదుగురు, శ్రీకాకుళంలో ఒకరు చొప్పున మృతి చెందారు. హుధుద్ దాటికి ఒక్క విజయనగరంలోనే రూ.125 కోట్ల నష్టం జరిగినట్లుగా అంచనా వేసినట్లు తెలుస్తోంది.
హుధుద్ తుపాను నష్టంపై ప్రాధమిక అంచనాను ఎన్డీఆర్ఎఫ్ బృందం వెల్లడించింది. వారి అంచనా ప్రకారం ఇప్పటి వరకు 1,728 పశువులు మృతి చెందగా, 6,556 ఇళ్లు ధ్వంసమయ్యాయి. మొత్తం 109 రైలు మార్గాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సుమారు 5,565 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఏడుగురు మృతి చెందారు. ఇతర అంచనాలు రూపొందించాల్సి ఉంది. నష్టంపై ఎల్లుండికి పూర్తి అంచనాకు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

తుపాను బీభత్సానికి విశాఖలో పడవలు మునిగిపోయాయి. నగరంలో కొన్ని కార్ల షో రూమ్నుంచి కార్లు క్రింద పడిపోయాయి. తుపాను బీభత్సంవల్ల రైలు మార్గం కూడా బాగా దెబ్బ తినడంతో 38 రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. హౌరా నుంచి విశాఖ వైపు వచ్చే రైళ్లను, హౌరా వైపు వెళ్లే రైళ్లనూ దాదాపు 30 వరకూ మార్గాన్ని దారి మళ్లించారు. మంచినీటి సరఫరా లేక, విద్యుత్ సరఫరా లేక, పాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. తుపాను బాధిత ప్రాంతాలలో ఎక్కడ చూసినా ప్రజల కడగండ్లు వర్ణనాతీతం.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం హుధుద్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించనున్నారు. హుధుద్ తుపాను దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్రకు జగన్ రేపు విశాఖకు వెళ్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి ధర్మాన ప్రసాద రావు తెలిపారు.
జగన్ విమానం ద్వారా హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరుకుంటారు. అక్కడ నుంచి కారులో ప్రయాణించి రోడ్డు మార్గం ద్వారా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వెళతారు. ఒకవేళ కారులో ప్రయాణించడానికి వీలు కాకుంటే ఆయన ద్విచక్ర వాహనంపై వెళతారు. అది కూడా కుదరకపోతే కాలినడకన కూడా వెళ్లి ఆయన బాధితులను పరామర్శిస్తారని ధర్మాన తెలిపారు.
తుపాను సహాయ కార్యక్రమాలు ముగిసి, సాధారణ పరిస్థితి నెలకొనే వరకు జగన్ ఉత్తరాంధ్రలోనే ఉంటారని చెప్పారు. తుఫాను సహాయ కార్యక్రమాలు ముగిసే వరకు జగన్ అక్కడే ఉంటారని తెలిపారు. జగన్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఉత్తరాంధ్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, ఇప్పటికే చంద్రబాబు తుఫాను సహాయ కార్యక్రమాలు ముగిసే వరకు ఇక్కడే ఉంటానని చెప్పిన విషయం తెలిసిందే.
24 గంటల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
హుధుద్ తుపాను తీవ్రత నెమ్మదిగా తగ్గుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఛత్తీస్గఢ్లో కేంద్రీకృతమైన తుపాను గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వెనక్కు తగ్గుతుందని తెలిపింది. దీని వల్ల రానున్న 24 గంటల్లో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించారు. ఉత్తరాంధ్రలో సుమారు 6 నుంచి 13 సెం.మీలు వర్షపాతం నమోదయ్యే అవకాశంముందన్నారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్నారు.












Click it and Unblock the Notifications